వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో పండుగ పూట విషాదఛాయలు అలుముకున్నాయి. బుద్దారం గ్రామంలో పాత మట్టి ఇళ్ళు కూలీ అర్ధరాత్రి ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అర్ధరాత్రి ఒక్కసారిగా మట్టి మిద్దె కూలడంతో అత్త మనెమ్మ, కొడళ్ళు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్ళు వైష్ణవి, పింకి మృత్యువాత పడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన చెవ్వ నర్సింహ ఏడాది క్రితం మరణించాడు. ఆయన భార్య మణెమ్మ గ్రామంలో నివసిస్తోంది. ఆమె కుమారులు హైదరాబాదులో ఉంటున్నారు. తండ్రి సంవత్సరీకం కోసం తమ కుటుంబాలతో మొన్ననే గ్రామానికి వచ్చారు. శనివారం ఆ కార్యక్రమం ముగిసింది. రాత్రి భోజనాల తర్వాత 9 మంది ఓ గదిలో పడుకున్నారు. ఒక్కసారిగా ఆ గది పైకప్పు కూలడంతో అందులో పడుకున్న మణెమ్మతో పాటు ఆమె ఇద్దరు కోడళ్లు సుప్రజ (40), ఉమాదేవి (35), మనవరాళ్లు వైష్ణవి (14), అక్షయ (12) అక్కడికక్కడే మరణించారు. మూడో కుమారుడు కుమారస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.  

ఇక పండగపూట ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు చనిపోవడంతో గ్రామంలో ఎక్కడా పండగ వాతావరణం కనిపించడం లేదు. వనపర్తి జిల్లా ఇంచార్జ్, నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సాయి శేఖర్, వనపర్తి ASP షాకీర్ హుస్సేన్, సీఐ సూర్య నాయక్, ఎస్సై రామన్ గౌడ్, గోపాలపేట మండల తహశీల్దార్ నరేందర్, గిర్దావరి పర్వతాలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువుల రోదనలు గ్రామా ప్రజలను సైతం కన్నీరు పెట్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: