సమాజంలో టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిన కానీ కొన్ని ప్రాంతాలల్లో మాత్రం ప్రజలు వెనకబడే ఉన్నారు. కనీసం సమాజంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని స్థాయిలో ఉండిపోయారు. ఇక మారుమూల ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇప్పటికీ సరైన టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. అలాంటి వారికి రేడియోనే ప్రధాన సామాచార సాధనంగా మారింది. ప్రకృతిలో జరిగే పెనుమార్పులు అనగా తుపాన్లు, వరదలు, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో రేడియోను మించిన సహాయక కేంద్రం ఉండదు. ఇది ముఖ్యంగా సముద్రంలో వేటకు వెళ్లే జాలర్లు ఇప్పటికే రేడియోపైనే ఆధారపడుతుంటారు. ఇక జాలర్లు వాతావరణ హెచ్చరికలను తెలుసుకుని మరీ వేటకు వెళ్తారు.

జాలర్లు చేపల వేటను ఆధారంగా చేసుకోని జీవనం సాగిస్తుంటారు. వారు చేపలను పట్టడమే కాదు వాటిని మార్కెట్ లోకి తీసుకొచ్చి అమ్మి సొమ్ము పోగు చేసుకోవాలి. వచ్చిన డబ్బులోనే ఇటు ఇల్లు, అటు జీవనాధారానికి సంబంధించిన వస్తువులను కూడా బాగు చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో అవసరాలను తీర్చడానికి దేశంలోనే తొలిసారిగా జాలర్ల కోసం ఒక ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఏర్పడింది. దీని ప్రత్యేకత మరొకటి ఉంది. ఇందులో పనిచేసే 12 మంది సిబ్బందిలో ఒక్కరు తప్ప మిగతా అందరూ జాలర్ల కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం.

ఇక తమిళనాడు తీరంలో శ్రీలంకకు కూత వేటు దూరంలోని పాంబన్ ద్వీపంలో ఈ రేడియో స్టేషన్ ఉంది. దీని పేరు ‘కడల్ ఒసై’. లక్ష జనాభా ఉన్న ఈ ద్వీపంలో 80 శాతం మంది చేపల వేటపైనే ఆధారపడి ఉన్నారు. స్వయంగా జాలరి అయిన విల్సన్ ఫెర్నాండో అనే వ్యక్తి 2016లో దీన్ని ఏర్పాటు చేశాడు. 24×7 చానలైన కడల్ ఒసై ప్రసారం చేసే కార్యక్రమాలన్నీ జాలర్లకు సంబంధించినవే కావడం విశేషం.

అంతేకాదు ఈ రేడియో స్టేషన్ లో వాతావరణ హెచ్చరికలు, చేపల ధరలు, డీజిల్ ధరలు, చేపలు పట్టే విధానాలు, చేపల గ్రేడింగ్, వాటి ఎగుమతులు, గవ్వలతో అలంకరణ వస్తువుల తయారీ, జాలర్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఉపకారవేతనాలు.. మరెన్నో అంశాలను ఈ జాలర్ల స్టేషన్ చక్కగా వివరిస్తుంది. పాంబన్ వెళ్లే వారికి అక్కడ చేపలతోపాటు రేడియోలు కూడా పెద్దసంఖ్యలో కనిపిస్తాయి. జాలర్లు ఎంచక్కా పడవల్లో, దుకాణాల్లో, గంపల్లో రేడియోలు పెట్టుకుని రేడియో వింటూ కనిపిస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: