తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను బలపరిచేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉప ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారి ఆయన్ను ఢీకొట్టిన నాయకుడు. తెలంగాణలో కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు వైఎస్సార్ ప్రయోగించిన అస్త్రంగా జీవన్ రెడ్డికి పేరుంది. జగిత్యాల నుంచి ఒకసారి టీడీపీ, ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి.. ప్రస్తుతం కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

దివంగత వైఎస్సార్‌కు ఎంతో నమ్మకంగా మెలిగిన జీవన్ రెడ్డి తాజాగా, ఓ ఇంటర్వ్యూలో వైఎస్సార్, ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006లో ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌పై కేసీఆర్‌ను రెచ్చగొట్టడంతో ఆయన రాజీనామా చేశారు. దీంతో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. ఆ సమయంలో వైఎస్సార్ బాగా ఆలోచించి కేసీఆర్‌పై నువ్వే పోటీ చేయాలని చెప్పడంతో చేశాను. ఆ ఎన్నికల్లో 2 లక్షల తేడాతో ఓడిపోయాను. ఆ తర్వాత 2008లో కేసీఆర్ మళ్లీ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో నేను మంత్రిగా ఉన్నా. కానీ, వైఎస్సార్ మాత్రం కేసీఆర్‌పై నేనే పోటీ చేయాలని కోరారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్సార్ దగ్గరకు వెళ్లి మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పాను. ఎందుకు జీవన్.. మంత్రిగా ఉండి కూడా పోటీ చేయొచ్చు కదా అని చెప్పారు. కానీ, కేసీఆర్ రాజీనామా చేసి వెళ్లినప్పుడు.. నేను మంత్రి పదవితో వెళ్తే జనాలు అంగీకరించరు. కాబట్టి మంత్రి పదవికి రాజీనామా చేస్తే జనాల్లోకి వెళ్లేందుకు బాగుంటుంది అని చెప్పాను. దీంతో వైఎస్సార్ నిజమేనని అంగీకరించారు. ఆ ఎన్నికల్లో కేవలం 14 వేల తేడాతో ఓడిపోయాను. అదే రోజు రాత్రి వైఎస్సార్ నాకు ఫోన్ చేసి నన్ను తప్పుదారి పట్టించారని క్షమాపణలు కోరారు. ‘‘సారీ జీవన్. ఇది నా తప్పే. నన్ను తప్పుదారి పట్టించారు’’ అని వైఎస్సార్ చెప్పారు. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ అధికారులు తప్పుగా అంచానా వేశారు. వైఎస్సార్ 2006 ఎన్నికల్లో అన్ని విధాలుగా పోరాడారు.. 2008లో మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. 2 లక్షల మెజారిటీ తగ్గుతుందని అనుకున్నారు గాని, స్వల్ప తేడాతో ఓడిపోతారని అనుకోలేదు. ఆ ఎన్నికల్లో కష్టపడితే గెలిచేవాళ్లం.

ఇక వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతైతే తొందరపడ్డారో మా అధిష్టానం కూడా కాస్త సంయమనం పాటించాల్సి ఉంది. జగన్ పార్టీకి దూరం కావడంతో ఏపీతో పాటు, తెలంగాణలోనూ నష్టపోయాం. తెలంగాణలో వైఎస్సార్ గ్లామర్ మాకు దక్కకుండా పోయింది. వైఎస్సార్ చనిపోయిన సమయంలో నేను కూడా జగన్‌కు అనుకూలంగా ఉన్నాను. క్విడ్ ప్రోకో, అవినీతి ఆరోపణలు, ఇలా రాజశేఖరరెడ్డి వల్ల పొరపాటు జరిగి ఉంటే మా కాంగ్రెస్ అధిష్టానం కూడా బాధ్యత తీసుకోవాలి. ఇది కుటుంబ నేపథ్యంలో జరిగింది అనుకుంటే ఎలా? ‘‘మన పార్టీ.. మన నాయకత్వాన్ని, మనం అవినీతి ముద్ర వేశాం. ప్రత్యర్థి వెయ్యలేదు.. మనమే అవినీతి ముద్ర వేశాం. ఇవన్నీ పార్టీ పరంగా కొన్ని తొందరపాటు చర్యలు. వీటన్నింటి ఫలితం ఇవాళ ఈ పరిస్థితి చూస్తున్నాం. పార్టీ పెట్టిన తర్వాత నన్ను పార్టీలోకి రావాలని జగన్ ఒత్తిడి చేశారు. కానీ, నేను ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉండటం, ఆయన వ్యతిరేకం కావడంతో వెళ్లలేదు.’’ అని జీవన్ రెడ్డి ఆనాటి సంగతులను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: