ఏపీలో ఎస్ఎంఎస్ వివాదం.. నాకే ఎస్ఎంఎస్ పంపిస్తారా?: నిమ్మగడ్డ


అమరావతి: ఏపీ సీఎంవోకి  ఎస్‌ఈసీ మధ్య ఎస్సెమ్మెస్‌ వివాదం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. లోక్ సభ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేపు జరిగే సమవేశానికి హాజరుకావాలంటూ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్. ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎస్సెమ్మెస్ పంపారు. అయితే రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న తనను ఎలా పిలిపిస్తారంటూ తమ పేషీ ద్వారా తిరిగి మెసేజ్‌ పంపారు నిమ్మగడ్డ. హైకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న తనతో ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయితే ఎస్ఈసీ సెక్రటరీ వాణిమోహన్‌కు పంపబోయి పొరపాటున ఎస్ఈసీకి పంపామని  ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. మరోవైపు తన అనుమతి లేకుండా ఎన్నికల నిర్వహణపై జరిగే సమావేశాలకు హాజరు కావొద్దంటూ వాణి మోహన్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అక్టోబరు 28న ఒక సమావేశం నిర్వహించాలని నిమ్మగడ్డ నిర్ణయించారు.

అయితే, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ వ్యక్తిగత కార్యదర్శి నుంచి రమేశ్‌కుమార్‌ ఆఫీసుకు శనివారం ఒక లేఖ వెళ్లింది. అక్టోబరు 26న ప్రవీణ్‌ ప్రకాష్‌ నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రమేశ్‌కుమార్‌ వ్యక్తిగత కార్యదర్శికి క్యాంప్ ఆఫీసు సిబ్బంది ఫోన్‌ చేసి కూడా చెప్పినట్టు తెలుస్తోంది.దీనిపై తీవ్రంగా స్పందించిన రమేశ్‌కుమార్‌ తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా, ప్రవీణ్‌ ప్రకాష్‌ కార్యాలయానికి ఒక లేఖ పంపినట్టు ఎన్నికల కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. హైకోర్టు జడ్జితో సమానహోదా గల పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్‌కి.. తన కంటే జూనియర్ సమావేశానికి హాజరవ్వాలని హుకుం జారీ చేయడం తీవ్ర అభ్యంతరకరమని, అది బెదిరింపు ధోరణిలా ఉందని నిమ్మగడ్డ ఘాటుగా లేఖ రాసినట్టు సమాచారం. అయితే, ఈ సమాచారం ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్‌కి పంపించాలన్నది తమ ఉద్దేశమని, పొరపాటున ఎన్నికల కమిషనర్‌కు వెళ్లిందని ప్రవీణ్‌ ప్రకాష్‌ కార్యాలయం చెప్పినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: