విశాఖ గీతం సంస్థల అధిపతి గీతం మూర్తి స్వయానా బాలకృష్ణ వియ్యంకుడు అన్న సంగతి తెలిసిందే. ఆయనకు చెందిన గీతం వర్శిటీలో ఓ 40 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని క్రమబద్దీకరణ చేయమని గీతం వర్శిటీ గతంలోనే దరఖాస్తు పెట్టుకుందట. బాలయ్యకు మూర్తి ఓ వియ్యంకుడైతే.. చంద్రబాబు మరో వియ్యంకుడు అన్న సంగతి తెలిసిందే. అంత దగ్గరి బంధువు అయినా సరే.. చంద్రబాబు గీతం భూముల క్రమబద్దీకరణ ఫైలును మోక్షం కలిగించలేదు.
ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నామని ప్రకటించింది. ఇప్పుడు దీనిపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని.. అంతగా అవకాశం ఉంటే అసలు చంద్రబాబు హయాంలో ఎందుకు క్రమబద్దీకరణ చేయలేదని లాజిక్ లాగుతున్నారు వైసీపీ నేతలు.. నిబంధనలకు విరుద్ధంగా బడ్డీకొట్టు పెట్టుకుంటేనే తీసేస్తున్నామని, అలాంటిది గొప్పోడు రూ.800 కోట్ల భూమి కబ్జా చేస్తే ఊరుకోవాలా..? చూస్తూ కూర్చోవాలా..? అని ప్రశ్నిస్తున్నారు.
అంతే కాదు.. చంద్రబాబుకు, లోకేష్కు గీతం యూనివర్సిటీ, భరత్, మూర్తిలపై ఏమాత్రం ప్రేమ లేదని, వాస్తవంగా అయితే గత ఎన్నికల్లో భరత్ గెలవకూడదనే చంద్రబాబు, లోకేష్ కోరుకున్నారని కొత్త విషయాలు చెబుతున్నారు. రాజకీయం కోసం ఇవాళ లేనిపోని ప్రేమను వలకబోస్తున్నారని.. రూ.800 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోవాలా..? అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు గీతం యూనివర్సిటీపై చిత్తశుద్ధి ఉంటే.. 5 సంవత్సరాల క్రితమే 40 ఎకరాల ల్యాండ్ రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదుని నిలదీస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పుడు మంత్రులుగా పనిచేసినవారు ఎందుకు పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్లో కూర్చొని కక్షసాధింపు, విధ్వంసం అని మాట్లాడుతున్నారని గట్టిగానే బదులిస్తున్నారు.