బీజేపీ, శివసేనల మధ్య ప్రస్తుత పరిస్థితులు ఏమంత సఖ్యతగా లేవు. రోజు రోజుకు మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలే మూసివేసిన ఆలయాలను, ప్రార్ధనా మందిరాలను తెరవాలని కోరుతూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్వారీ రాసిన లేఖ వివాదాస్పదమయిన విషయం తెలిసిందే. తాజాగా ముంబయిలో నిర్వహించిన దసరా ర్యాలీలో ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. శివసేన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది అయిందని, తాను సీఎం అయిన మొదటి రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కొందరు అంటూనే ఉన్నారని మండిపడ్డారు. 'నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు ధైర్యం ఉంటే చేసి చూపించండి' అని థాక్రే సవాలు విసిరారు.

హిందూత్వ గురించి ఎవరూ తమకు చెప్పనక్కర్లేదని గవర్నర్‌కు చురకలంటించారు. ‘హిందుత్వం గురించి చెప్పే వాళ్లు రాష్ట్రంలో ఆలయాలు ఎందుకు తెరవడం లేదని కొందరు తమను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.. బాలాసాహెబ్ హిందుత్వానికి, ఉద్ధవ్ థాక్రే హిందుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని వారు అంటున్నారు.. వాళ్ల (ప్రత్యర్థులు) హిందుత్వం కేవలం అరుపులకే పరిమితం, తమ హిందుత్వం అలాంటిది కాదు’ పరోక్షంగా గవర్నర్‌కు కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, మీరు హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బీఫ్‌పై మహారాష్ట్రలో నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.. కానీ గోవాలో ఎందుకు అనుమతించారు.. ఇదేనా మీ హిందుత్వం?’ అని ప్రశ్నించారు. హిందుత్వానికి పూజలతో మాత్రమే సంబంధం లేదని ఈ రోజు మోహన్ భగవత్ అన్నారు.. కాబట్టి నల్ల టోపీ ధరించి, మన నమ్మకాలను ప్రశ్నించి, మమ్మల్ని లౌకికవాదని పిలిచినవారు ఈ ప్రసంగం వినాలి’ అని అన్నారు. ‘మీరు బలమైన హిందూత్వ వాది. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే అయోధ్యను కూడా సందర్శించారు. లౌకికవాదాన్ని ద్వేషించే మీరు హఠాత్తుగా లౌకికవాదిగా మారిపోయారా?’ అని ఉద్ధవ్‌కు రాసిన లేఖలో గవర్నర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బార్లు, రెస్టారెంట్లు, బీచ్‌లు తెరిచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. దేవుళ్లు, దేవతలను మాత్రం లాక్‌డౌన్‌లోనే ఉంచుతుందా? అని నిలదీశారు. దీనికి ఠాక్రే ఘాటుగా బదులిస్తూ ప్రార్థనా మందిరాలు తెరిస్తే హిందూత్వ వాదిని, లేకపోతే లౌకికవాదినా అని నిలదీశారు. ‘లౌకికవాదం అనేది రాజ్యాంగంలో కీలక అంశం కాదా? గవర్నర్‌గా మీకు ఆ సంగతి తెలియదా? నా హిందూత్వం గురించి మీ సర్టిఫికెట్‌ అవసరం లేదు’ అని ఠాక్రే పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: