ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు కేవలం శ్రామికులుగా మాత్రమే మిగిలిపోయే కాలం పోయిందని, వారు పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదిగే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఇందులో భాగంగా నేడు ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం మేర ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూములు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకున్న వారు ఎలా ముందుకెళ్లాలి? ఎవరిని కలవాలి? అన్న అంశాలపై వారికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం వైసీపీ ప్రభుత్వం 2020– 23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’’ పేరిట రూపొందించిన సరికొత్త కార్యక్రమాన్ని వైఎస్ జగన్‌ సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని హర్షం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా కోటి రూపాయిల ప్రోత్సహకాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. వారిలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫెసిలిటేషన్‌ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, క్వాలిటీ సర్టిఫికేషన్‌, పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు.. ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు లభిస్తున్నాయని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలని సీఎం జగన్ అన్నారు. ఎవరి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే ఉద్దేశంతోనే నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సచివాలయాల్లో కూడా 82 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయని గుర్తు చేశారు. అలాగే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: