ఇసుకను ఆన్లైన్ బుకింగ్ చేసుకునే విధానం వచ్చాక .. .రాష్ట్రంలో అందరికీ ఆన్లైన్ సదుపాయం అందుబాటులో లేకపోవడం, ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే విధానాన్ని కొందరు అక్రమమార్గంలో వినియోగిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఇసుక బుకింగ్స్లో సాఫ్ట్వేర్ని హ్యాక్ చేస్తున్న కొందరిని గుర్తించింది. వారిపై కేసులు కూడా నమోదు చేసింది. అయినప్పటికీ ఆన్లైన్ వ్యవహారంలో లోటుపాట్లు జరుగుతుండటంతో ... ప్రస్తుతం పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే ఇసుక బుక్ చేసుకోవాలనే నిబంధనను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇసుకను కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలోనే తీసుకెళ్లాలనే నిబంధన ఉండగా ఇప్పుడు దానిలో కూడా మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక ధరతో పాటుగా రవాణా చార్జీలు కూడా కలిపి వసూలు చేస్తుండడం వల్ల ఇసుక ధరలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందని ఇసుక విధానంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించింది. పలు చోట్ల సరైన పరిమాణంలో ఇసుక సరఫరా కావడం లేదని, ఆర్డర్ చేసిన వారి ఇంటికి వారు చేసిన మొత్తానికి సరిపడా పరిమాణంలో ఇసుక రవాణా కాకపోవడం వంటి విషయాలను కూడా ఉపసంఘం గుర్తించింది. కొందరు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ఇసుక రవాణా విలువకు మించి ఎక్కువ మొత్తం కూడా వసూలు చేస్తున్నారని గుర్తించి, మళ్లీ ఇసుక విధానంలో కొన్ని మార్పులు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.