తెలంగాణలో మరో కిడ్నాప్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన హైదరాబాద్ షామిర్ పేటలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. రూ.15 లక్షల కోసం ఓ బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి బయట ఆడుకుంటున్న ఆదియాస్ (5) ఈ నెల 15వ తేదీన అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు వెతికినా ఆచూకీ కనిపించలేదు. దీంతో అదియాస్ తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

అదియాస్ అదృశ్యమై పది రోజులు దాటింది. కానీ పోలీసులకు ఎలాంటి క్లూస్ దొరకలేదు. చివరికి బాలుడి ఇంటి ఎదురుగా ఉన్న ఓ యువకుడిపై పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిని విచారించగా.. అసలు విషయం బయట పడింది. విచారణలో.. టిక్ టాక్ చేసే సమయంలో బాలుడిని గాల్లో ఎగరవేసినప్పుడు అదుపుతప్పి కిందపడిపోయాడని, తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడని చెప్పాడు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో బాలుడి మృతదేహాన్ని శామీర్ పేట నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్లు యువకుడు తెలిపాడు.

దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవం కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అయితే టిక్ టాక్ చేసినప్పుడు గాయపడి చనిపోయిన బాలుడిని కిడ్నాప్ చేసి రూ.15 లక్షలు ఎందుకు డిమాండ్ చేశాడు..? హత్య వెనుక ఇంకెవరిదైనా హస్తం ఉందా..? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగించారు.

కాగా, కొద్ది రోజుల కిందట మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్ట్ కుమారుడు దీక్షిత్ రెడ్డిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హతమార్చారు. ఇలాంటి దారుణ ఘటనను మరువక ముందే మరో ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ అయి హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు పిల్లల తల్లిదండ్రులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: