బీహార్ లో జేడీయూ, బీజేపీ ఒక కూటమి అని అందరికీ తెలిసిందే. అయితే బీజేపీ తన మానాన తాను పోస్టర్లు వేసుకుంటూ ప్రచారం చేసుకుంటోంది. బీజేపీ పోస్టర్ల మీద మోడీ బొమ్మ, బీహార్ కి చెందిన బీజేపీ నాయకుల బొమ్మలు మాత్రమే ఉంటున్నాయి. అలాగే జేడీయూ కూడా మరో పోస్టర్ తో ప్రచారం చేసుకుంటోంది. దాని మీద నితీష్ కుమార్ బొమ్మ మాత్రమే ఉంటుందిట. ఎక్కడా ప్రధాని మోడీ బొమ్మను ఎవరూ చూసి ఎరగరు. మరి కూటమి కదా ఈ కుంపట్లేంటి అంటే అక్కడే ఉందిట రాజకీయ తమాషా.
బీహార్ ని ఒక్కసారి అయినా ఏలాలని బీజేపీకి ఉంది. కానీ నితీష్ దాన్ని కుదరనీయడంలేదు. ఈసారి కూడా ఆ ఆశ నెరవేరలేదు. దాంతో సీట్లు ఎక్కువగానే బీజేపీ రాబట్టుకుంది. సరే ఉమ్మడి ప్రచారం అయితే జరుగుతోంది కానీ పోస్టర్లు మాత్రం ఎవరివి వారివే ఉంటున్నాయి. ఇక బీజేపీ పోస్టర్లో నితీష్ ఎందుకు కనిపించడం లేదు అంటే దానికి కమలనాధుల వింతైన జవాబు చెబుతున్నారు. నితీష్ పదిహేనేళ్ళు సీఎం గా చేశారంట. జనాలకు కొంత అసంత్రుప్తి ఉందిట. అది తమ పార్టీ మీద పడకుండా ఆయన బొమ్మను వేయడంలేదుట.
మరి బీజేపీకే నితీష్ మీద డౌట్ ఉంటే ఈ కూటమి గెలిచేది ఎలా. అందుకేనా బీజేపీ రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ చేత లోక్ జన శక్తి తరఫున వేరేగా పోటీ పెట్టించి డ్రామాలు ఆడుతోందని జేడీయూ నేతలు కస్సుమంటున్నారు. ఇక నితీష్ ని నమ్మకండి మోడీజీ అని చిరాగ్ అపుడే అంటున్నాడు. అలాగే మోడీని నమ్మకుండా నితీష్ కూడా తన ప్రయత్నాల్లో ఉన్నారట. మొత్తానికి భలే దోస్తీ ఇది అని అంతా అంటూంటే ఓటర్లు మాత్రం షాక్ తింటున్నారుట.