2020 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు గడిచిన సుమారు గత 10 నెలలుగా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గుతున్నట్లే తగ్గి తిరిగి మరలా తన పంజా విసురుతుంది. మరీ ముఖ్యంగా  యూరప్ దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మరలా ఉధృతం కావడంతో అక్కడ నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఫలితంగా మనదేశంలో కూడా అంత‌ర్జాతీయ క‌మర్షియ‌ల్ విమానాల రాక‌పోక‌ల‌పై ఇప్పటికే అమ‌ల్లో ఉన్న నిషేధాజ్ఞలను న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగిస్తున్నట్లు ది డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (DGCI) బుధ‌వారం (అక్టోబర్ 28) ఒక ప్రకటన విడుదల చేసింది. యూర‌ప్ దేశాల్లో క‌రోనా వైరస్ మ‌రోసారి వ్యాపిస్తున్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఎంపిక చేసిన కొన్ని ప్రత్యేక మార్గాల్లో మాత్రం అంత‌ర్జాతీయ క‌మ‌ర్షియ‌ల్ విమాన స‌ర్వీసుల‌ను అనుమ‌తిస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. అన్ని ర‌కాల అంత‌ర్జాతీయ కార్గో స‌ర్వీసులు మాత్రం యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. వీటితో పాటు కేంద్ర హోం శాఖ అనుమతించిన ప్రత్యేక విమాన స‌ర్వీసుల‌కు కూడా ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని పేర్కొంది. క‌రోనా వైరస్ కట్టడి కోసం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఈ ఏడాది మార్చి 23 నుంచి అంత‌ర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే... అయితే గత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లో కుదేలయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే అవసరమున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కొంత కాలం నుండి వివిధ కార్యకలాపాలు కొనసాగించుకోవడానికి వీలుగా లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. కానీ.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై మాత్రం నిషేధం పొడిగిస్తూనే వస్తోంది. గత నెల సెప్టెంబర్‌లో విధించిన అన్‌లాక్-5 నిబంధనలను మరలా నవంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా డీజీసీఏ కూడా అంతర్జాతీయ విమాన సేవలపై మ‌రోసారి నిషేధాన్ని పొడిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: