తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన గొర్రెకుంట 9మంది హత్య కేసులో తుదితీర్పు వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ను దోషిగా తేల్చిన వరంగల్ సెషన్స్ కోర్టు.. సంజయ్ కు ఉరిశిక్ష ఖరారు చేసింది. బీహార్కు చెందిన సంజయ్ కుమార్ 2020 మే 21న తొమ్మిది మందిని వరంగల్ గీసుకొండలోని గొర్రెకుంట బావిలో పడేసి జలసమాధి చేశాడు. తాను నేరం చేసినట్లు సంజయ్ అంగీకరించాడు. దీంతో సంజయ్ ను దోషిగా నిర్ధారించిన జడ్జి జయకుమార్ ఉరిశిక్ష ఖరారు చేశారు.
తినే ఆహారంలో మత్తు మందు కలిపి బతికుండగానే 9మందిని బావిలో పడేసిన విషయం తెలిసిందే ఈ 9 గురిలో మసూద్ ఆలం అనే వ్యక్తి బంధువైన మహిళతో సంజయ్ కుమార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆ మహిళను మొదట హత్య చేశాడు . ఆ హత్య విషయం బయటికి రాకుండా చేసేందుకు ఆలం కుటుంబంతో పాటు మొత్తం 9మందిని హత్య చేశాడు సంజయ్. ఈ కేసులో పోలీసులు 5 నెలల్లోనే విచారణ పూర్తి చేయడం, కోర్టు శిక్ష ఖరారు చేయడం విశేషం.
ఒక హత్యను కప్పిపుచ్చేందుకు 9 మందిని సంజయ్ కుమార్ హత్య చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. నిందితుడు కేసు నుండి తప్పించుకోకుండా పోలీసులు పక్కాగా సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు నిందితుడికి ఉరిశిక్షను విధించింది.