దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో వుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక రానున్నది శీతకాలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం.. ఢిల్లీ NCR (నేషనల్ క్యాపిటల్ రీజియన్) వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేస్తూ కొత్త ఆర్డినెన్స్ని జారీ చేసింది. Commission for air Quality Management for Delhi-NCR పేరిట దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించడం విశేషం.
ఇకపోతే, ఈ కమిషన్ 18 మంది సభ్యులతో ఏర్పడనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ 18 మంది సభ్యుల్లో 10 మంది అధికారులు, బ్యూరోక్రాట్లు ఉండగా, మరికొందరు నిపుణులు, కార్యకర్తలు పాలు పంచుకోనున్నారు. వీరిని పర్యావరణ మంత్రి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పాటు మరో ముగ్గురు మంత్రులు, క్యాబినేట్ కార్యదర్శి మూడేళ్ల పదవీ కాలానికి నియమించనున్నారు.
కాలుష్య హెచ్చు స్థాయిలను నియంత్రించడానికి పరిశోధన, ఆవిష్కరణల కోసం ఉప సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చంటూ కేంద్రం సదరు ఆర్డినెన్స్లో పేర్కొంది. ఇక ఈ కమిషన్ చేయు విధులు ఏమంటే, గాలి నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు దానికి సంబంధించిన చట్టాలను అమలు చేసేలా చూస్తుంది. అలాగే పంటల వ్యర్థాల దహనం, ఫ్యాక్టరీల వ్యర్ధాల డి కంపోజిషన్ మొదలైన కాలుష్యానికి సంబంధించిన అన్ని ఇతర అంశాలను ఈ కమిషన్ పరీక్షించనుంది.