ఆందోళన వద్దు..! ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌...! అవును మీరు విన్నది నిజమే. ఈ మాటలు అనేది ఎవరో కాదు. సాక్షాత్తూ భారత ప్రధాని మోడీ. ఒక జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో దేశంలోని ప్రతి పౌరుడికి వ్యాక్సిన్‌ అందిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని మోడీ.

ప్రపంచమంతా  కరోనా సెకండ్‌ వేవ్‌తో ఆందోళన చెందుతున్న వేళ.. ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఊరటనిచ్చారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. ప్రతి ఒక్కరికీ  అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఒక జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఏ ఒక్క వ్యక్తినీ విడిచిపెట్టకుండా, అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తేస్తామన్నారు. అయితే ముందు ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కి వ్యాక్సిన్‌ అందిస్తామని తెలిపారు ప్రధాని మోడీ.

వ్యాక్సిన్ తయారీ పురోగతిలో ఉందనీ, ట్రయల్స్ కొనసాగుతున్నా యన్నారు మోడీ. దేశంలో వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని చివరి మూలల్లో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని మోడీ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు మోడీ.

ఎన్డీయే అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కానీ ఇప్పుడు ప్రధాని ఇచ్చిన హామీకి ప్రాధాన్యం లభించింది. వ్యాక్సిన్ ను నిల్వచేయడానికి 28 వేల కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మోడీ. దేశంలో ఎన్నికలు, విపత్తు నిర్వహణ పనులు ఎలా జరుగుతాయో.. వ్యాక్సిన్ డెలివరీ వ్యవస్థను కూడా అలాగే అభివృద్ధి చేయాలని మోడీ అధికారులకు సూచించారు.

ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తూ ఎందరినో ఆస్పత్రి పాలు చేస్తోంది. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి మాత్రం తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతోంది. ప్రధాని మోడీ ఉచిత వ్యాక్సిన్ హామీతో భారత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: