అందుకే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు బాలయ్య మీద కూడా వైసీపీ గురి పెట్టిందా అన్న కొత్త డౌట్లు అందరిలోనూ వస్తున్నాయి. బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ కి చెందిన గీతం విద్యా సంస్థలను ఇపుడు అసలు వదిలేలా వైసీపీ కనిపించడంలేదు. అక్రమ కట్టడాలు అంటూ కూల్చుడు పనులు మొదలెట్టిన వైసీపీ పెద్దలు ఇపుడు ఏకంగా గీతం విద్యా సంస్థల డీమ్డ్ యూనివర్శిటీ గుర్తింపే రద్దు చేయాలని యూజీసీకి ఫిర్యాదు చేయడంతో కధ ఎంతదాకా వెళ్తుందా అన్నది చర్చగా మారింది.
నిజానికి యూజీసీ నిబంధనల ప్రకారం డీమ్డ్ యూనివర్శిటీలకు కచ్చితంగా డాక్యుమెంట్లలో పేర్కొన్న ప్రకరాం భూమి ఉండాలి. ఆ భూమి వారిదై ఉండాలి. కానీ గీతం విద్యా సంస్థలు కొంత ప్రభుత్వ భూమిలో కూడా కట్టడాలు జరిపారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. అంతే కాదు, డీమ్డ్ యూనివర్సిటీ నిబంధనలను గీతం పాటించలేదని కూడా పేర్కొన్నారు.
డీమ్డ్ వర్శిటీ హోదాను రద్దు చేయడంతో పాటు గీతం ని ఆంధ్రా వర్శిటీకి అనుబంధంగా చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ ప్రొక్రియాన్ కి యూజీసీకి రాసిన లేఖలో విజయసాయిరెడ్డి పేర్కొనడాన్ని బట్టి చూస్తే గీతం కధ కంచికి చేర్చాలని వైసీపీ పెద్దలు వ్యూహాత్మకంగానే రెడీ అవుతున్నారనుకోవాలి. మరి బాలయ్యకు ఇది ఇండైరెక్ట్ గా తగిలే వ్యవహరమే. ఆయన దాన్ని ఎలా ఎదుర్కొంటారు అన్నది కూడా చూడాలి.