ఏపీలో ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వయంగా రైతు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈయన వరి పంట వేయడానికి గాను ఏపీ సీడ్స్ దగ్గరనుండి నాణ్యమైన వరి విత్తనాలను కొనుగోలు చేసారు. తన నియోజకవర్గంలోని వేమవరం గ్రామంలో వీటిని పొలంలో వేశారు, అయితే నాట్లు వేసిన తరువాత నాలుగు రోజుల క్రితం వెళ్లి పంటను పరిశీలించగా అనుకున్నంతగా వరి కంకు పెరగలేదు. సరి అయిన దిగుబడి రాదని నిర్ధారించుకున్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే ఈయన వ్యవసాయ జేడీ విజయభారతి కి ఫిర్యాదు చేసారు.
ఆమెను నాసిరకం విత్తనాలను ఇచ్చినందుకు దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేసారు. వెంటనే స్పందించిన జేడీ విజయభారతి బాపట్లలో వ్యవసాయ శాస్త్రజ్ఞులను విచారణ నిమిత్తం ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఇక్కడ కొసమెరుపేంటంటే రైతులంతా ప్రభుత్వం అందించే విత్తనాలపై నమ్మకముతో ఉంటారు. మరియు ఎక్కువ మొత్తంలో విత్తనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యే కి నాసిరకం విత్తనాలను పంపిణీ చేస్తే, ఇక రైతుల పరిస్థితిని మీరు ఊహించుకోగలరు. విత్తనాల నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు ఏంచేస్తున్నారో తెలియని పరిస్థితి. ఇకముందైనా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.