కరోనా వైరస్ మహమ్మారి తరువాత ఇప్పుడు మరలా భూకంపం, సునామీల రూపంలో ఉపద్రవాలు ముంచుకొచ్చి టర్కీ, గ్రీస్‌ దేశాల్లో పెను విధ్వంసం సృష్టించాయి. ఏజియన్‌ సముద్రంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ సంభవించింది. దీని ఫలితంగా టర్కీలోని మెట్రోపాలిటన్‌ నగరమైన ఇజ్మిర్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది అలాగే ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి మీడియా వర్గాలు తెలుపుతున్నాయి.

ఏజియన్‌ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో రిక్టర్‌ స్కేలుపై 6.6 తీవ్రతతో ఈ భూంకంపం వచ్చినట్లు టర్కీ డిజాస్టర్‌ అండ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. అలాగే టర్కీ మీడియా మరియు అమెరికా జియోలాజికల్ సర్వేలు రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.0గా ఉన్నట్లు పేర్కొన్నాయి.

ముఖ్యంగా టర్కీలోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఇజ్మిర్‌ పట్టణంలో పలు ప్రాంతాల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. భూంకంపం కారణంగా సంభవించిన చిన్నపాటి సునామీతో సముద్రపు నీరు వీధుల్లోకి రావడం కనిపించింది. కొన్ని చోట్ల భవనాలు కుప్పకూలడంతో వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం లేదని ఇజ్మిర్‌ గవర్నర్‌ తెలిపారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని ఇస్తాంబుల్‌ గవర్నర్‌ పేర్కొన్నారు. గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. గ్రీస్‌కు చెందిన ద్వీపం సామోస్‌లోనూ భూకంపం రావడంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కుప్పకూలిన భవనాల వద్ద అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకి తీసుకొస్తున్నారు. ఒక్కసారిగా భూకంపం, సునామీల రూపంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా సతమతమవుతున్న టర్కీ, గ్రీస్ ల గురించి ప్రపంచ దేశాల ప్రజలు ప్రార్థనలు చేయమంటూ పలువురు నెటిజన్లు, ప్రజలు మరియు వివిధ ప్రజా సంఘాలు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: