గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు వ్యవహారంతో చాలా రోజుల పాటు రియల్ వ్యాపారం ఆగిపోయింది. అనుకున్నంత వ్యాపారం లేక లావాదేవీలు పూర్తిగా నిలిచి పోయాయి. ఆ తర్వాత కొద్దిగా కొలుకున్నా.. ఇంతలో కరోనా..లాక్డౌన్..ఇప్పుడు ప్రభుత్వ తాజా నిబంధనలతో ఆర్థిక భారాలతో వెంచర్లలో ప్లాట్ల కొనుగోలుకు, బయట వ్యక్తిగత ప్లాట్ల కొనుగోలుకు జనాలు జంకుతున్నారు. ఇదిలా ఉండగా అక్రమ లేఅవుట్లు, అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులను తీసుకునే ప్రక్రియ నడుస్తోంది. ఈ క్రమంలోనే లక్షలాదిగా దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎప్పటికి ప్రారంభమవుతాయో అర్థం కాక జనం తల్లడం మల్లడమవుతున్నారు.
లాక్ డౌన్, కరోనాకు ముందు హెచ్ఎండీఏ పరిధిలోని ప్రతి ఊర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆకాశమే హద్దుగా సాగింది. ఇప్పుడేమో వెంచర్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒప్పందం కుదుర్చుకున్న భూ అమ్మకాలకు సంబంధించిన ప్రక్రియలో అనేక మంది వ్యాపారులు ఇరుక్కుపోయారనే చెప్పాలి. వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి వస్తోందిన బెంబెలెత్తిపోతున్నారు.ఇప్పట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేంత డబ్బులు చేతికందే అవకాశం లేకపోవడం, మరొకరి చేతి కొనిపించేంత స్థాయి కనుచూపు మేరలో లేవు. దాంతో అప్పులకు వడ్డీలు కట్టడం కంటే అగ్రిమెంటు సొమ్మును తిరిగి తీసుకోవడమే ఉత్తమమన్న అభిప్రాయంలో ఉన్నారు.