ఖమ్మం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తితో తన కుటుంబ సభ్యులు వివాహం చేయరనే అనుమానంతో మనస్తాపానికి గురైన ఓ యువతి కత్తితో గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్ లో మెరుగు దుర్గారావు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని పెద్ద కుమార్తె మాధురి (22)కి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఆ యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు.


దీంతో యువతి తమ ఇంటి సమీపంలో ఉన్న ఓ యువకుడిని ప్రేమించిన విషయం ఇంట్లో వారికి చెప్పింది. అయితే తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసేందుకు ఆసక్తి చూపలేదు. పెద్దకుమార్తె అయిన నీవు కులాంతర వివాహం చేసుకుంటే చిన్న కుమార్తె, కుమారుడికి వివాహాలు ఎలా చేయాలని తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించారు. దీంతో తాను ప్రేమించిన వ్యక్తితో తనకు వివాహం చేయరనే అనుమానంతో ఆ యువతి గురువారం రాత్రి గదిలో తలుపులు వేసుకొని కత్తితో గొంతు కోసుకుంది.


రక్తపు మడుగులో పడిఉన్న మాధురిని ఆమె సోదరి చూసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మంలోని ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు. మూడు ఆసుపత్రులు తిరిగినా ఎవరూ చేర్చుకోకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు యువ‌కుడిపై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: