డబ్బుల కోసం ఈ మధ్య కాలంలో కొందరు  ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. డబ్బుల కోసం కన్న బిడ్డలను కూడా అమ్మేస్తున్నారు కొందరు. దీనిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో బాబును విక్రయించిన కేసులో నాచారం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారు. డబ్బుల కోసమే బాబు ను అమ్మినట్టు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. శిశువుకు జన్మ ను ఇవ్వక ముందే ఒక లక్ష రూపాయల కు డీల్ కుదుర్చుకున్నారు.

ముందే అడ్వాన్స్ 50 వేలు తీసుకున్న బాబు తల్లిదండ్రులు మీనా, వెంకటేష్...  బాబుని విక్రయించారు. అంతకుముందు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు ఈ సారి కూడా ఆడ పిల్ల పుడుతుందని భావించిన మీనా, వెంకటేష్... బాబు పుట్టేసరికి షాక్ అయ్యారు. బాబు పుట్టడం తో అనుకున్న డీల్ కంటే మరో నాలుగు లక్షల అదనంగా డిమాండ్  చేసారు ఆ ఇద్దరు. జానకి అలియాస్ ఝాన్సీ  మధ్యవర్తిత్వం ద్వారా బాబును రాజేష్ నవీన దంపతులు కొనుక్కున్నారు. మరో నాలుగు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నిరాకరించాడు రాజేష్.

దింతో నాలుగు నెలల తర్వాత పోలీసులకు బాబు తల్లి తండ్రులు ఫిర్యాదు చేసారు. తల్లిదండ్రులు కేసుతో బయటపడ్డ  మొత్తం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మిన వారిని , కొన్న వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు మొత్తం నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. బాబు తల్లిదండ్రులు మీనా, వెంకటేష్, మధ్యవర్తి జానకి, బాబును కొన్న రాజేష్ ను అరెస్ట్ చేసారు నాచారం పోలీసులు. అరెస్ట్ చేసిన అందరిని కూడా మరికొద్దిసేపట్లో రీమాండ్ కు పోలీసులు తరలించే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: