బీజేపీ నాయ‌కులు వరుసగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండడంతో ముఖ్యమంత్రి నేరుగా స్పందించారు. జ‌న‌గామ జిల్లాలోని కొడ‌కండ్లలో రైతు వేదిక‌ను ప్రారంభించిన అనంత‌రం సీఎం కేసీఆర్ మాట్లాడారు. పెన్షన్ల విష‌యంలో బీజేపీ నాయ‌కులు చేస్తున్న అస‌త్య ప్ర‌చారాల‌ను ఎండ‌గ‌ట్టారు. బీజేపీ నాయ‌కులు ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డ‌బ్బులు చెల్లిస్తుంద‌ని చెబుతున్నారు. ఒకవేళ దాన్ని ఎవ‌డైనా మొగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతాను’’ అని సీఎం కేసీఆర్ తీవ్రమైన స‌వాల్ చేశారు.

‘‘దుబ్బాక‌ ఉప ఎన్నికలో బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయ‌కులు ఘోరాతి ఘోర‌మైన అబ‌ద్దాలు మాట్లాడుతున్నారు. మ‌న రాష్ర్టంలో 38 ల‌క్షల 64 వేల 751 మందికి అన్ని ర‌కాల పెన్షన్లు ఇస్తున్నాం. ఈ పెన్షన్లలో కేంద్రం కేవ‌లం 7 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే ఇస్తోంది. మ‌నిషికి 200 మాత్రమే కేంద్రం ఇస్తుంది. సంవ‌త్స‌రానికి క‌లిపి కేంద్రం ఇచ్చేది రూ.105 కోట్లే. రాష్ర్టం రూ.10 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లు ఇస్తుంది. బీజేపీ నాయ‌కులు ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ విష‌యాల‌న్నీ ప్ర‌జ‌లంద‌రికీ తెలియాలి. వీటన్నిటిపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్క తీసి అధికారికంగా విడుద‌ల చేసింది. ఆ లెక్క‌ల‌న్నీ కాగ్ వ‌ద్ద ఉన్నాయి. ఒక వేళ నేను చెప్పేది అబ‌ద్ధమే అయితే.. ఎవ‌డ‌న్న మొగోడు వచ్చి రుజువు చేస్తే నేను ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి ఇంటికి పోతా. ఓట్ల కోసం బీజేపీ నాయకులు ఘోర‌మైన మోసాలు చేస్తున్నారు. వారికి నిజ‌మైన ప్రేమ‌లేదు.. ఓట్లు మాత్ర‌మే కావాలి. ఈ మ‌ధ్యనే కేంద్రం వ్యవ‌సాయ బిల్లు తెచ్చింది. గూండాగిరి చేసి మరీ బిల్లును ఆమోదించుకున్నారు’’ అని సీఎం కేసీఆర్ బీజేపీ పార్టీ నేతలపై ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: