బిహార్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ బీహార్ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ యువనేత అయిన తేజస్వీ యాదవ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ వంటి హేమాహేమీలకే ప్రచార వ్యవహారాలలో చెమటలు పట్టిస్తున్నారు. తాజాగా తేజస్వీ యాదవ్ పోరాటంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశంసలు కురిపించారు. ఒకపక్క తన కుటుంబ సభ్యులు జైళ్లు, కేసుల్లో ఇరుక్కుపోయినా అతడు మాత్రం మొక్కవోని ధైర్యంతో పోరాటం చేస్తున్నాడని కొనియాడారు. ప్రతి ఒక్కరికీ సవాల్ విసురుతూ దూసుకెళ్తోన్న తేజస్వీ రేపు ముఖ్యమంత్రి అయినా అశ్చర్యపడనక్కర్లేదని పేర్కొన్నారు.

సంజయ్ రౌత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ...‘ఎలాంటి సహకారం లేని ఓ కుర్రాడు.. తన కుటుంబ సభ్యులను జైల్లో పెట్టినా, సీబీఐ, ఐటీ కేసులు చుట్టుముట్టినా.. బీహార్ లాంటి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సవాల్ విసురుతున్నాడు. రేపు తేజస్వి యాదవ్ బీహార్ సీఎం అయినా ఆశ్చర్చపోనక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. దాణా కుంభకోణం కేసులో తేజస్వీ తండ్రి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. కాగా బీహార్ ఎన్నికల మేనిఫేస్టోలో బీజేపీ ఇచ్చిన వ్యాక్సీన్ హామీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదంటూ ఈసీ పేర్కొనడంపైనా రావత్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘భారత ఎన్నికల కమిషన్ బీజేపీ బ్రాంచ్ లాంటిది. కాబట్టి వారి నుంచి ఏమీ ఆశించలేం’ అని ఆయన ఆరోపించారు. ఇక సీఎం నితీశ్ కుమార్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తేజస్వీ యాదవ్ మాటల ఎదురుదాడి చేశారు. గతం గురించి కాదు, వాస్తవాల గురించి మాట్లాడాలని.. బహిరంగ చర్చకు సిద్ధమేనా అని తేజస్వీ సవాల్ ప్రశ్నించారు.‘నిరుద్యోగం వంటి అంశాలను నితీశ్ ప్రస్తావించడం లేదు.. మేము వర్తమానం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే ఆయన మాత్రం గతించిపోయిన వాటిని గుర్తు చేసుకుంటున్నారు.. ఈ విషయంలో జేపీ నడ్డాతోనూ బహిరంగ చర్చకు సిద్ధమే’ అని తేజస్వీ యాదవ్ సవాల్ విసిరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: