ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. పోలవరం ప్రాజెక్టు లో కేంద్ర ఆర్థిక శాఖ కొర్రీలకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు. సీఎం జగన్ ప్రధానికి ఈ అంశంపై లేఖ రాశారు అని చెప్పుకొచ్చారు. 2014 విభజన చట్టం ప్రకారం పూర్తిగా కేంద్రమే పోలవరం ప్రాజెక్టు ఖర్చు భరించాలి అని ఆయన డిమాండ్ చేసారు. 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తాన్ని కూడా చెల్లించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది అని ఆయన అన్నారు.

2015-16 లో పీపీఏ 6 సమావేశాలు నిర్వహించి సవరించిన అంచనాలు కోరితే వాయిదాలు వేశారు అని ఆయన ఆరోపణలు చేసారు. 2016 సెప్టెంబర్ లో 100 శాతం ఇర్రిగేషన్ కాంపోనెంట్ ను 2014 ధరల ప్రకారం చెల్లిస్తామని చెప్పారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది అని అన్నారు. 2014 కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును చెల్లించం అని కేంద్రం ఆ సమయంలో చెప్పింది అని... దానికి కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అని అన్నారు.

2017 మార్చి వరకు కూడా ప్రాజెక్టు కు ఎంత ఖర్చు అవుతుంది అని గుర్తించలేక పోయిన అసమర్థత గత ప్రభుత్వానిది అని ఆయన విమర్శించారు. పదేపదే పీపీఏ కోరినా వివరాలు ఎందుకు ఇవ్వలేకపోయారు అని ఆయన నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్నే ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు అని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా డిసెంబర్ 2021 కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం అని స్పష్టం చేసారు. ఓ కీలకమైన ప్రాజెక్టు కు సంబంధించిన వాస్తవాలు ఎందుకు దాచిపెట్టారు అని నిలదీశారు. పరిశ్రమలకు నీళ్లు, పవర్ హౌస్ కుకూడా నిధులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: