వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల నవంబర్ 6 నుంచి 10 రోజుల పాటూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల దగ్గరకు వెళ్లి ఇంకా ఏమైనా చేయాల్సిన పనులు ఉన్నాయా అని అడగటం గురించి.. అలాగే ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను ఈ కార్యక్రమాల ద్వారా తెలుసుకోవటం గురించి ఈ కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నవంబర్‌ 6 నుంచి జరగబోయే ఈ కార్యక్రమాల రూపకల్పన జరుగుతోంది అని తెలిపారు.

భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేశారన్నారు. సుమారు 14 నెలల పాటు ప్రజల్లో ఉంటూ 3,640 కిలో మీటర‍్ల దూరం నడిచారని గుర్తుచేశారు. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇచ్చిన హామీలను 90శాతం అమలు చేశారని.. సంక్షోభాలను తట్టుకొని ప్రభుత్వాన్ని నడిపించారు అన్నారు. పరిపాలనను వికేంద్రీకరించి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి ముందుకు పరిపాలన తెచ్చారని ప్రశంసలు కురిపించారు. సంక్షేమ నగదు నేరుగా లబ్దిదారుని ఖాతాలోకే వెళ్తున్నాయన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు కింద స్కూల్ ఎలా అభివృద్ధి చెందుతున్నాయో ప్రజలంతా చూస్తున్నారన్నారు.మా ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేశామని.. అన్నింటిలో వారికి 50 శాతం స్థానం కల్పించామన్నారు. ఏడాదిన్నరలోనే ఇవన్నీ చేసిన సందర్బంగా పార్టీ ప్రజల్లోకి వారి అభిప్రాయం తెలుసుకునేందుకు వెళుతుంది.. ఈ కార్యక్రమాలు 10 రోజుల పాటు నిర్వహించబోతున్నామన్నారు. ఇంకా ఏమైనా చేయాల్సిన పనులు ఉన్నట్లయితే అవి నేరుగా వారి నుంచే తెలుసుకుంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: