2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఆకర్షించారు రాపాక వరప్రసాద్. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో అసెంబ్లీలో మాట్లాడుతూ తాను జనసేనలో నంబర్‌ వన్‌గా ఉంటానని.. 152 కాదలచుకోలేదని గంభీరమైన డైలాగులు చెప్పి వేడి పుట్టించారు. అయితే కొద్దికాలంలోనే మాట తిప్పేసి అధికార వైసీపీ పక్షాన చేరిపోయారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను, పార్టీ విధానాలను విమర్శిస్తూ అధికార పార్టీ పంచన చేరిపోయారు.

అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఎస్సీ ఎమ్మెల్యే అని భావించారో, లేక ఉన్న ఒక్క ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటే బాగోదని అనుకున్నారో ఏమో కానీ తిరుగుబాటు ప్రకటించిన రాపాక వరప్రసాద్‌పై పవన్‌ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అలాగే గీత దాటిన సొంత పార్టీ ఎమ్మెల్యేపై పవన్‌ ఇంత వరకు కటువుగా మాట్లాడింది కూడా లేదు. ఆయనకేం ఇబ్బందులు ఉన్నాయో అంటూ చాలాసార్లు రాపాకపై మీడియా వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. ఈ తరుణంలో రాపాకకు జనసేనాని పవన్ కళ్యాణ్ మాటలతో కాకుండా చేతలతో షాక్ ఇచ్చారు. ఇటీవలే 5 నియోజకవర్గాల్లో జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభించగా, అందులో రాజోలు మొదటి స్థానంలో నిలిచిందట. తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యేపై కసి మీదనో లేక కేడర్ అంతా జనసేనాని పవన్‌ కళ్యాణ్ వైపే ఉన్నామని చెప్పడానికో కానీ ప్రత్యేక కమిటీలు వేసి మరీ క్రియాశీల సభ్యత్వాలు పెంచారట. రాజోలులో ఎమ్మెల్యే రాపాక ప్లేట్‌ ఫిరాయించిన తర్వాత అక్కడ జనసేన పార్టీ ఇన్‌చార్జి కూడా లేరు అయినప్పటికీ సభ్యత్వ నమోదు విషయంలో లోకల్‌ నాయకత్వం చూపించిన చొరవను జనసేనాని పవన్ ప్రత్యేకంగా అభినందించారని సమాచారం.

అలాగే ఇటీవల కోస్తా ప్రాంత జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. రెండురోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశాల్లో రాజోలు కోసమే ప్రత్యేకంగా సమయం కేటాయించి స్థానిక నాయకులతో జనసేనాని మంతనాలు చేశారట. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కీలక చర్చలు జరిపారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఎక్కువ సీట్లు గెలిచి పార్టీ సత్తా చాటాలని పార్టీ కేడర్‌కు జనసేనాని ఆదేశించారని తెలుస్తోంది. జనసేన టికెట్‌పై గెలిచి.. సొంత విజయంగా చెప్పుకొంటున్న రాపాకకు గట్టి జవాబివ్వాలని కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు బాగా కష్టపడాలని పవన్‌ క్లాస్‌ తీసుకున్నారట. దీంతో రాజోలులోని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచి తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యే రాపాక ప్రసాద్‌కు పవన్‌ కళ్యాణ్ తగిన విధంగా సమాధానం ఇవ్వబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఇది తెలుసుకున్న జనసైనికులు సైతం జరగబోయే ఎన్నికల కోసం ఎంతగానో ఆశగా, ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: