ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై తెలంగాణలోని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘునందన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇక ఎమ్మెల్యే రఘునందన్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రఘునందన్ రావుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.


‘‘నేను సైన్స్ టీచర్ని.. ప్రకృతిని నమ్ముతాం. వెనకటి ఒకాయన గిట్లే మాట్లాడి, గట్లే పోయిండు.. పావురాల గుట్టల. నువ్వు కూడా గంతే. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది.’’ అని వైఎస్సార్ మరణంపై రఘునందన్ రావు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్సార్ పరిస్థితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా వస్తుందని అనేలా రఘునందన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా ఇన్‌చార్జి దేవేందర్ రెడ్డి గుర్రంపాటి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘అయ్యా ర‌ఘునంద‌న‌ రావా.. త‌మ‌రెంత‌.. త‌మ‌రి బ‌తుకెంత‌..? మీరు వైఎస్సార్ గారి మ‌ర‌ణం గురించి మాట్లాడేంత వారా? మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి గారు పొందిన త‌ర‌హా మ‌ర‌ణాన్ని పొందాలంటే పాల‌కుడిగా పెట్టి పుట్టాలి! త‌న తుదిశ్వాస ను కూడా ప్రజ‌ల కోసం పోతూనే విడిచిన చ‌రిత్ర వారిది! అప్పుడు మీలాంటి బొకాడియాలు ఎక్కడున్నారో ఎవ‌రికీ తెలియ‌దు.


మీరేంటి, చిత్తు కాగితంతో స‌మాన‌మైన మీ చ‌రిత్ర ఏమిటో మాకు అన‌వ‌స‌రం. మీరు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయం చేయాలనుకుంటే.. మీ ప్రత్యర్థి పార్టీల‌ను విమ‌ర్శించుకోండి. మా పార్టీ గ్రేట‌ర్ బ‌రిలో లేక‌పోయినా మీ లాంటి వాళ్లకు మా నేత‌లు నిద్ర లేకుండా చేస్తున్నట్టున్నారే! మీ రాజ‌కీయం కోసం మీరు గుడికే వెళ్తారో, గుండు కొట్టించుకుంటారో మాకు అన‌వ‌స‌రం. ఒక‌టి గుర్తుంచుకోండి... ఆంధ్రప్రదేశ్ దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖర రెడ్డి గురించి కానీ, వైఎస్ కుటుంబం గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. కొత్త బిచ్చగాడు పొద్దెర‌గ‌న‌ట్టుగా మీరు ఇష్టానుసారం మాట్లాడ‌వ‌ద్దు, మ‌రోసారి ఈ త‌ర‌హాలో మాట్లాడితే.. అందుకు ప‌ర్యవ‌స‌నాల‌ను ఎదుర్కొనాల్సి ఉంటుందని బ‌హిరంగంగా చెబుతున్నాం. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు ర‌ఘునంద‌న‌రావ్!’’ అని దేవేందర్ రెడ్డి గుర్రంపాటి అన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ చీఫ్ డిజిటల్ మీడియా డైరెక్టర్ కె. భాస్కర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రఘునందన్ రావు వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జత చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: