గ్రేటర్ ఎన్నికలు చూస్తే ఒక మినీ శాసన సభ ఎన్నికల సంగ్రామాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎవరు విజేతలు అన్నది ఊహకు అందకుండా దూకుడుగా అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఎన్నికలకు కొద్ది నెలల ముందు హైదరాబాద్ ని భారీ వరదలు ముంచేత్తాయి. దాంతో విశ్వ నగరం కాస్తా నిండా మునిగింది. పెద్ద ఎత్తున అనేక కాలనీలు ముంపునకు గురి అయి రోజుల తరబడి అగచాట్లు పడ్డాయి. ఇప్పటికీ ముంపు కాలనీవాసుల కధలు, వెతలు అలాగే ఉన్నాయి.

అధికార టీయారెస్ పదివేలు వంతున కుటుంబానికి సాయం కోసం 550 కోట్లను మంజూరు చేసి చాలా మటుకు ఆదుకున్నామని చెబుతున్నా హైదరాబాద్ విషయంలో జనాలకు భయాలు అలాగే ఉన్నాయి. చినుకు పడితే భాగ్యనగరం చిత్తడేనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ విషయంలో ఎన్నో ఊహించుకున్న వారు సైతం తాజా వరదల తాజా వరదలకు బిత్తరపోయారు.

మహా నగరం లోగుట్టు ఇదా అని ఆశ్చర్యానికి లోను అయ్యారు. ఇక మధ్యతరగతి మేధావి వర్గాల్లో కూడా అధికార పార్టీ మీదనే ప్రత్యేకించి ఈ విషయంలో వ్యతిరేకత ఉంది. ఆర్ధిక సాయం చేసి చేతులు దులిపేసుకోవచ్చు కానీ భాగ్యనగరానికి శాశ్వతమైన ప్రణాళిక ఉండాలని కోరుతున్నారు. హైదరాబాద్ నలువైపులా ఆక్రమణల వల్లనే ఇలా ముంపు ఏర్పడిందని అంటున్నారు.

ఈ దురాక్రమణల వెనక రాజకీయ పార్టీలు నాయకులు ఉన్నారని కూడా అంటున్నారు. వారిని కట్టడి చేయకుండా ఆర్ధిక సాయం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అన్న మాట కూడా ఉంది. మొత్తానికి ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి అధికార పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉంది అంటున్నారు. దాన్ని మరింత రెట్టింపు చేస్తూ బీజేపీ కాంగ్రెస్ కూడా టీయారెస్ మీదనే విమర్శలు చేస్తున్నారు. బీజేపీ అయితే తమ చేతిలో గ్రేటర్ హైదరాబాద్ ని పెడితే దురాక్రమణలు తొలగిస్తామని అంటోంది. ఇక కాలనీ వాసులు ముంపు ప్రాంత బాధితులు అయితే వరదల మీద మండిపోతున్నారు.  తాజాగా మజ్లీస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ నిరసనను ఎదుర్కొన్నారు. దీంతో ఎటూ ఆరేళ్ళ టీయారెస్ పాలన మీద వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుందని, దానికి తోడు ఇపుడు  ముంపు కూడా కొంప ముంచేలా ఉందని అధికార పార్టీలో కంగారు మొదలైందిట.


మరింత సమాచారం తెలుసుకోండి: