ఎన్నికల సిబ్బందికి రేపు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధులకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. డిసెంబర్ ఒకటవ తేదీన జరిగే ఎన్నికలకు పీ.ఓ, ఏ.పీ.ఓ లకు రేపు అంటే మంగళవారం నాడు ఎన్నికల శిక్షణను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణకు పీ.ఓ., ఏ.పీ.ఓ లుగా అవసరమైన 21 వేల మంది సిబ్బందికి 24 వ తేదీన నిర్వహించే శిక్షణకు హాజరు కావాల్సిందిగా జీహెచ్ఎంసీ ఇప్పటికే సమాచారం పంపినట్టు తెలుస్తుంది.
వీరికి శిక్షణ నిచ్చేందుకై 166 మాస్టర్ ట్రైనీలను ఏర్పాటు చేశామని ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. రేపు ఉదయం 11 గంటలనుండి ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలనుండి 4 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల శిక్షణకు హాజరయ్యే సిబ్బందిలో ఎవరైనా హైదరాబాద్ నివాసితులుంటే వారికే అక్కడే పోస్టల్ బ్యాలెట్ ను అందిస్తారని ఎన్నికల సంఘం ప్రక్కటించింది. ఈ శిక్షణకు ఎవరైనా గైరుహాజరు అయితే తదుపరి రోజు వారికి శిక్షణ ఏర్పాటు చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు. ఇక ఎన్నికల విధులకు గైరుహాజరు అయ్యే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు చేపట్టడం జరుగుతుందని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి హెచ్చరించారు.