ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ ఆ ఎన్నికల ఫలితాలపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారంటూ ఆయన న్యాయస్థానాల్లో దావాలు వేశారు. ట్రంప్ వేసిన దావాలను కొన్ని న్యాయస్థానాలు తిరస్కరించాయి. తాజాగా, పెన్సుల్వేనియా కోర్టు ట్రంప్ దావాను తిరస్కరించింది. ఈ సందర్భంగా ట్రంప్‌పై న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ను మారే షెల్లీ నవలలో ఫ్రాంకెన్‌స్టెయిన్ సృష్టించిన రాక్షసుడు వంటి వ్యక్తని న్యాయమూర్తి మాథ్యూ బ్రాన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎటువంటి ఆధారాల్లేకుండా ఊహాజనిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది పౌరులు మాత్రమే కాకుండా ఏ వ్యక్తి ఓటు హక్కును హరించే అధికారం ఆయనకు లేదని పేర్కొన్నారు.


ఈ తీర్పుపై ట్రంప్ తరఫున లాయర్ ర్యూడీ గులియనీ మాట్లాడుతూ.. ఇది తమను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని అన్నారు. అంతేకాదు, న్యాయపోరాటంపై తమ వ్యూహాన్ని మార్చుకోడానికి ఈ తీర్పు సహకరిస్తుందని వ్యాఖ్యానించారు. దీనిని ఫిలడెల్ఫియాలోని మూడో యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో సవాల్ చేయనున్నట్టు తెలిపారు. ఆ సర్క్యూట్‌లోని న్యాయమూర్తులలో చాలా మంది ట్రంప్ నామినేట్ చేసివారే ఉన్నారు. మొత్తం నలుగురిని ట్రంప్ నామినేట్ చేశారు. నవంబర్ 9 న దాఖలు చేసిన దావాలో మెయిల్-ఇన్ బ్యాలెట్ల కౌంటీ ఎన్నికల అధికారులు అస్థిరంగా వ్యవహరించారని ట్రంప్ తరఫున లాయర్ ఆరోపించారు. కొన్ని కౌంటీలు ఓటర్లకు రహస్య ఎన్వలప్‌లు లేకపోవడం వంటి చిన్న లోపాలను గుర్తించామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి బ్రాన్ ట్రంప్‌ను మారే షెల్లీ నవలలో ఫ్రాంకెన్‌స్టెయిన్ సృష్టించిన రాక్షసుడు లాంటివాడని వ్యాఖ్యానించారు. తాజా తీర్పుపై ఎన్నికలపై పరిశోధనలు చేసే రిక్ హసెన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘నేటి తీర్పు చట్ట పాలనకు, పెన్సిల్వేనియా ఓటర్లకు దక్కిన విజయం.. ట్రంప్ ఊహాజనిత ప్రచారానికి చెప్పపెట్టు’ అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: