ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దుబ్బాక ఉపఎన్నికల హడావుడి ఏ స్థాయిలో జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక వేడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ మాత్రం ముందుగానే కొంచెం దూకుడు పెంచింది.. పనబాక లక్ష్మి పేరును అధినేత చంద్రబాబు ఇటీవలే ఖరారు చేశారు. దీంతో అక్కడ కచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తామని తెలుగు తమ్ముళ్లు కూడా కాన్ఫిడెన్స్‌తో కనిపించారు. ఇటు వైఎస్సార్‌సీపీ కూడా కొత్త స్ట్రాటజీతో దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబం కాకుండా అనూహ్యంగా డాక్టర్ గురుమూర్తిని తెరపైకి తీసుకొచ్చింది.. ఆయనకు టికెట్ ఫైనల్ చేసింది.. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు. ఇక జనసేన, బీజేపీలు పోటీపై క్లారిటీకి రాలేదు. అయితే అభ్యర్థిని ప్రకటించి దూకుడుగా కనిపించిన టీడీపీకి కొత్త సమస్య వచ్చి పడింది.

పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆమె కేడర్‌కు టచ్‌లోకి రాలేదనే ప్రచారం జరుగుతోంది. ఆమె పేరును ఖరారు చేసినా మీడియా ముందుకు కూడా రాలేదు. టికెట్ రావడంపై స్పందనను తెలియజేయలేదు. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. పనబాక మౌనం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీన్ని వైఎస్సార్‌సీపీ కేడర్ క్యాష్ చేసుకుంటోంది.. సోషల్ మీడియాలో టీడీపీని టార్గెట్ చేస్తోంది. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పోటీ నుంచి తప్పుకున్నారని వైఎస్సార్‌సీపీ అంటోంది. సోషల్ మీడియాలో కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలను కూడా ప్రస్తావిస్తోంది. ఆమె టీడీపీ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని.. అందుకే మౌనంగా ఉన్నారంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఆమె బీజేపీలోకి వెళతారని ప్రచారం చేస్తున్నారు. అందుకే ఆమె సైలెంట్ అయ్యారంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగు తమ్ముళ్లు కూడా వైఎస్సార్‌సీపీకి కౌంటర్ ఇస్తున్నారు. ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదని.. ఇప్పుడే అంత తొందర ఏముంది అంటున్నారు. ఆమె తన ఇంట్లో ఓ శుభకార్యంతో బిజీగా ఉన్నారని.. త్వరలోనే ప్రచారం ప్రారంభిస్తారని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: