తాజాగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఒక ప్రకటన విడుదల చేసారు. ఓటు మన హక్కు మాత్రమే కాదు .... బాధ్యత కూడా అని తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్ధసారథి అన్నారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సరైన నాయకుడిని ఎన్నుకోండి అని ఆయన సూచించారు. కులమతాలకు అతీతంగా సమాజ అభివృద్ధికి ఓటేయండి అని ఆయన సూచించారు. జిహెచ్ఎంసి ఎన్నికలలో ఓటువేసి వార్డుల అభివృద్ధికి బాటలు వేయండి అన్నారు.
యువత, విద్యాధికులు తప్పనిసరిగా ఓటింగులో పాల్గొని ఓటింగ్ శాతం పెంచండి అని కోరారు. కోవిడ్ పేషంట్ లు, వికలాంగులు, 80 ఏండ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాం, వినియోగించుకొని ఓటేయండన్నారు. వికలాంగులు, వయోధికులకు పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు, ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేసాం ఉపయోగించుకొని ఓటేయండని సూచించారు. వృద్ధులు, పసి పిల్లల తల్లులు, వికలాంగులు క్యూలైన్ తో సంబంధం లేకుండా నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో కోవిడ్ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం, నిర్భయంగా ఓటు వేయండని అన్నారు. డిసెంబర్ 1 వ తేది ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంచండి అని సూచించారు.