తన సొంత పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ కి ఘోషామహల్ లో విలువ ఇవ్వకుండా అభ్యర్ధులను సెలెక్ట్ చేసి ఇప్పటికే అక్కడ ఓటమి రాసిపెట్టుకున్న బీజేపీ ఇపుడు మరో బ్లండర్ మిస్టేక్ చేసిందని అంటున్నారు. మహా నేత ఉమ్మడి ఏపీని అయిదుంపావు సంవత్సరాలు పాలించిన వైఎస్సార్ మీద దుబ్బాకలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు చేసిన హార్ష్ కామెంట్స్ ఇపుడు జనంలోకి వెళ్ళిపోయాయి.
వెనకటికి ఒకడు ఇలాగే చేసి పావురాల గుట్టలో పావురం అయిపోయాడు అంటూ రఘునందనరావు చేసిన కామెంట్స్ ఒక వర్గంలో కాక పుట్టించాయి. అంతే కాదు, తెలంగాణా నిండా వైఎస్సార్ అభిమానులు ఉన్నారు. అలాగే గ్రేటర్ హైదరబాద్ లో ముప్పై లక్షల మంది దాకా సెటిలర్స్ ఉన్నారు. వారిలో వైఎస్సార్ ని ఇష్టపడే వారు పెద్ద ఎత్తున ఉన్నారు.
వీరంతా గత ఎన్నికల్లో టీయారెస్ ని సపోర్ట్ చేశారు. ఇపుడు మారిన రాజకీయం నేపధ్యంలో బీజేపీకి మద్దతు ఇస్తారని కూడా అంటున్నారు. అలా నోటి కాడకు వచ్చిన ఆహారాన్ని కాలదన్నుకున్నట్లుగా బీజేపీ ఇలా చేసుకుందని అంటున్నారు. రఘునందనరావు ఎందుకు ఈ హార్ష్ కామెంట్స్ చేయాల్సి వచ్చిందో కానీ బీజేపీ కొంప ముంచారు అనే అంటున్నారు. టీయారెస్ నేతలను విమర్శించడం వరకూ ఓకే కానీ ఎపుడో పదకొండేళ్ళ క్రితం మరణించిన వైఎస్సార్ ని ఇప్పటి రాజకీయాల్లోకి తీసుకువచ్చి అలా అనడం దారుణాతిదారుణం.
విలువలు సంప్రదాయాలు గురించి చెప్పే బీజేపీలో రఘునందనరావు చేరి ఎమ్మెల్యే కావడం వరకూ ఓకే కానీ ఇలా తన పాత వాసనలతో బీజేపీకి చెడ్డ తెచ్చారని అంటున్నారు. మొత్తానికి రఘునందనరావు చేత బీజేపీ క్షమాపణలు చెప్పించినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ అయితే ఇప్పటికే జరిగిపోయిందని అంటున్నారు. చూడాలి మరి దీని మీద రిపేర్లు ఏమైనా బీజేపీ చేసుకుంటుందేమో.