స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. బర్దోలీకి చెందిన స్థానిక మహిళ రష్మీ కటారియా గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి కూడా. అయితే ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న చిరాగ్ పటేల్ ఆమెపై కన్నేశాడు. కష్టకాలంలో అండగా ఉంటానని నమ్మించాడు. అలా నమ్మిన రష్మీ చిరాగ్ పటేల్ తో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే గత ఆదివారం రాత్రి మూడేళ్ల కుమారుడిని రష్మి తన తల్లి ఇంటి వద్ద ఉంచి వెళ్లిపోయింది. అలా వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు గాలించిన దోరకలేదు. చిరాగ్ పటేల్ మీద అనుమానంతో కుటుంబ సభ్యులు విషయం పోలీసుల దృష్టికి తెచ్చారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు చిరాగ్ ను విచారించగా సంచలన విషయాలు బయట పడ్డాయి. రష్మీని హత్య చేసి జేసీబీ సహాయంతో తన తండ్రి ఫాంహౌస్లో పూడ్చివేశానని పోలీసులకు చెప్పాడు. వారిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగానే హత్య చేశానని పటేల్ ఒప్పుకున్నాడు.
కాగా, చిరాగ్ భార్యపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె రష్మీపై దాడికి పాల్పడ్డారని, ఈ హత్యలో ఆమె పాత్ర కూడా ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దీని పై పూర్తి విచారణ చేపడతామని వెల్లడించారు. ఘటనాస్థలిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.