ప్రధానమంత్రి నరేంద్ర మోడి మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణా సిఎం కేసీఆర్ తన అభిప్రాయాలను కూడా వెల్లడించారు. శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేసారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానం పై చర్చ జరగగా... వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అన్నారు. శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉంది అని అన్నారు. వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పారు. దీనికి అనుగుణమైన కార్యాచరణను రూపొందించాం అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అన్నారు.

కరోనా వైరస్ కూడా దేశమంతటి పైనా ఒకే రకమైన ప్రభావం చూపలేదు అన్నారు. వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. కాబట్టీ మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలి అన్నారు. పది, పదిహేను రోజులు పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగతా వారికి ఇవ్వాలి అని సూచించారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రజ్వీ, మెడికల్ హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రమేష్ రెడ్డి, హెల్త్ యూనివర్సిటి విసి కరుణాకర్ రెడ్డి, కోవిడ్ నిపుణులు కమిటి సభ్యుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: