2018 ఎన్నికల తర్వాత టీడీపీలోని మిగిలిన నేతలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ల్లోకి వెళ్ళిపోయారు. ఏదో కొందరు మాత్రం టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు. అలాగే అశ్వరావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు టీడీపీలోనే ఉన్నారు. అయితే టీడీపీ ఉనికి కాపాడుకోవాలంటే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల వేడి బాగా ఉంది.
గ్రేటర్ బరిలో అనేక పార్టీలు ఉన్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్,ఎంఐఎంల మధ్య పోరు నడవనుంది. అయితే ఎంఐఎం పాతబస్తీ వరకే పరిమితం కానుంది. ఇక వీళ్ళ మధ్య టీడీపీ ఎంతవరకు బండి లాగుతుందనే చెప్పలేం. అయితే టీడీపీకి కొన్ని డివిజన్లలో మంచి ఓటు బ్యాంక్ ఉంది. ఏపీ ప్రజలు ఎక్కువగా ఉన్న కొన్నిచోట్ల టీడీపీకి మంచి పట్టుంది. అలా టీడీపీకి మంచి పట్టున్న డివిజన్ ‘కేపిహెచ్బి’.
గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే కేపిహెచ్బిలో మాత్రం టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు. దీంతో ఈసారి కూడా అక్కడ గెలిచి సత్తా చాటాలని టీడీపీ అనుకుంటుంది. అటు అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు సైతం ఈ డివిజన్లో పాగా వేయాలని చూస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకే ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తోంది. చూడాలి మరి మిగిలిన పార్టీలని పక్కకునెట్టి కేపిహెచ్బిలో టీడీపీ ఏ మేర సత్తా చాటుతుందో.