హైదరాబాద్‌లో మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన వెంటనే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై విపక్షాలు దీటుగా కౌంటర్ ఇస్తున్నాయి. ఇప్పటికే దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాజాగా, ఈ అంశంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కూడా స్పందించారు. ఈ విషయంలో బండి సంజయ్‌కు ఒవైసీ సవాలు విసిరారు.


పాతబస్తీ ప్రాంతంలో రోహింగ్యాలు, పాకిస్థాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగానే పాతబస్తీపై సర్టికల్ స్ట్రైక్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలోని ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్‌ ప్రచారం నిర్వహించారు. ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి మేయర్ పీఠం దక్కించుకుంటే.. బిడ్డా.. నీ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. రోహింగ్యాలను, పాకిస్థానీలను తరిమి తరిమి కొడతాం’’ అని అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి హెచ్చరించారు. అయితే, బండి సంజయ్ ఈ వ్యాఖ్యలను అంతకుముందు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించే చేశారు. నగరంలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఎన్నికల ప్రచారంలో ఒవైసీ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై ఒవైసీ స్పందించారు. దేశంలో ఉన్నవాళ్లంతా ఇండియన్లేనని అన్నారు. ‘‘బీజేపీకి 24 గంటల సమయం ఇస్తున్నాం. పాతబస్తీలో పాకిస్థాన్ వాళ్లు ఎవరున్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పాలి. భారత సరిహద్దు వద్ద చైనా 970 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అక్రమించింది. దమ్ముంటే అక్కడకు వెళ్లి అమిత్‌షా సర్జికల్ స్ట్రైక్ చేయాలి. దేశం నుంచి ముస్లింలను వేరు చేయలేరు. టెర్రరిస్టులు, పాకిస్థాన్‌ అనే పదాలు లేకుండా ప్రచారం చేయగలరా? దమ్ముంటే చదువు, అభివృద్ధి గురించి చెప్పి ఎన్నికల్లో విజయం సాధించాలి’’ అని బీజేపీకి అసదుద్దీన్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: