2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అందులో భాగంగానే విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సంకల్పించిన సీఎం జగన్.. ప్రభుత్వ వైద్యశాలల్లో మౌళిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. తాజాగా, మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.



రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పేరు మీద "వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌"లు ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 560 వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లకు సర్కార్ అనుమతులు ఇచ్చింది. క్లీనిక్‌ల కోసం 355 కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 205 భవనాలకు మరమ్మతులు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్‌ క్లినిక్‌ల నిర్మాణానికి జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ఆరోగ్యశాఖ నుంచి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. ఈ అర్బన్ క్లినిక్‌లు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ తరహాలో ఉంటాయి. ఢిల్లీలో సామాన్య ప్రజలు జ్వరం, చిన్నాచితక రోగాలు వస్తే ప్రయివేట్ హాస్పిటళ్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. పేదలకు వైద్యం భారం కావొద్దనే ఉద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మొహల్లా క్లినిక్‌లు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు)ను ఏర్పాటు చేసింది. ఇందులో డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఉండదు. అంతే కాదు మందులు, వైద్య పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తారు. ఇదే తరహాలో ఏపీలోనూ వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లు పని చేస్తాయి. ఇవి ప్రస్తుతం ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తర్వాతి దశలో గ్రామాల్లో కూడా విస్తరిస్తారని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: