దుబ్బాకలో విజయం సాధించిన బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ బందర్ లడ్డూలా కనిపిస్తోంది. కార్పోరేషన్ పైన కాషాయా జెండా ఎగరాల్సిందే అన్నది బీజేపీ పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఓ వైపు రెచ్చగొట్టే నాయకత్వం, మరో వైపు నచ్చచెప్పే లీడర్ షిప్. ఈ విధంగా పార్టీలోని వారిని రెండుగా విభజించుకుని బీజేపీ ఎన్నికల రధాన్ని పరుగులు తీయిస్తోంది.
తెలంగాణాలో బీజేపీకి కిషన్ రెడ్డి సీనియర్ మోస్ట్ నేత. అంతే కాదు ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. దాంతో కేంద్రం గ్రేటర్ హైదరాబాద్ కి ఏం చేసిందన్నది ఆయన చెప్పాల్సిన బాధ్యతను తీసుకున్నారు. తెలంగాణాకు నయా పైసా సాయం కేంద్రం చేయలేదని ఓ వైపు టీయారెస్ నేతలు తీసిపారేస్తూంటే తాము చేసిన సాయమేంటి అన్నది కిషన్ రెడ్డి సోదాహరణంగా వివరిస్తున్నారు. అంతే కాదు గ్రేటర్ హైదారాబాద్ ని తమ చేతిలో పెడితే తాము ఏం చేయగలమో కూడా వివరిస్తున్నారు. పూర్తిగా డెవలప్మెంట్ యాంగిల్ లో కిషన్ రెడ్డి ప్రసంగాలు సాగుతున్నాయి.
మరో వైపు తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ అయితే ఫుల్ గా అగ్రెసివ్ మోడ్ లో వెళ్తున్నారు. ఆయన ఏకంగా సర్జికల్ స్ట్రైక్స్ అంటూ హాట్ హాట్ పదాలే వాడేస్తున్నారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ చేసిన కామెంట్స్ ఇపుడు అతి పెద్ద రాజకీయ రచ్చగా మారిపోయాయి. టీయారెస్ ని కావాలని ముగ్గులోకి లాగుతున్నారు. మతం మీద డిబెట్ పెట్టి ఎన్నికల అజెండా బండి సంజయ్ అలా సెట్ చేస్తున్నారు. మజ్లీస్ తో దోస్తీ వల్ల టీయారెస్ ఏం సాధించిదని అడిగేస్తూ కడిగేస్తున్నారు. మొత్తానికి ఒకరు ఆవేశం, మరొకరు ఆలోచన ఇలా బండి సంజయ్, కిషన్ రెడ్డి క్రిష్ణార్జులు మాదిరిగా మారి గ్రేటర్ లో బీజేపీ రధాన్ని విజయం వైపుగా తీసుకెళ్తున్నారు.