ప్రతి పార్టీ గట్టిగానే ప్రచారం చేస్తుంది. 150 డివిజన్లలోనూ టీఆర్ఎస్ పోటీ చేస్తుంటే, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 100 స్థానాలకు పైనే పోటీ చేస్తుంది. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ల మధ్య ఉండేలా కనిపిస్తోంది. ఇక ఎంఐఎం కొన్ని ప్రాంతాల్లో, టీడీపీ నాలుగైదు ప్రాంతాల్లో సత్తా చాటే అవకాశముంది. అయితే ఇందులో కొన్ని పార్టీలు రహస్య ఒప్పందం చేసుకుని ముందుకెళుతున్నాయని ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.
అసలు బీజేపీకి జనసేన బహిరంగంగానే మద్ధతు ప్రకటించిన విషయం తెలిసిందే. అటు టీఆర్ఎస్-ఎంఐఎంల మధ్య రహస్య ఒప్పందం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, ఇందులో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ విమర్శిస్తుంది. అటు టీఆర్ఎస్తో కొందరు కాంగ్రెస్ నేతలు అంటకాగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలా ప్రతి పార్టీ వేరే వాళ్ళతో రహస్య ఒప్పందం కుదుర్చుకుంటున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఇక ఎవరు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నా అధికార టీఆర్ఎస్కే మెజారిటీ డివిజన్లు దక్కే అవకాశముందని తెలుస్తోంది. అటు పాతబస్తీలో ఎంఐఎం ఎక్కువ డివిజన్లే గెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు ఎక్కువ గెలుస్తారనేది అంచనా రావడం లేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీకి మంచిగానే సీట్లు వస్తాయని అంటున్నారు. అటు టీడీపీ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ పార్టీ ఇతర పార్టీల విజయావకాశాలు దెబ్బతీసే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి చూడాలి గ్రేటర్ వార్లో ఎవరిది పైచేయి అవుతుందో.