బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారి తుఫాన్ గా మారింది. ఇక దీనికి నివర్ అనే పేరు పెట్టటం తెలిసిందే. పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన నివర్ తుఫాన్ ప్రస్తుతం ఏపీలోకి ప్రవేశించింది. ఈ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారి చిత్తూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలపై ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయంటున్నారు. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.


మరోవైపు నివర్‌ తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం వైయస్‌.జగన్‌ అధికారులతో సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. తుపాను ప్రభావం, దీనివల్ల కురుస్తున్న వర్షాలపై సీఎంవో అధికారులు వివరాలు అందించారు. తుఫాన్ తీరాన్ని తాకిందని.. క్రమంగా బలహీనపడుతోందని వివరించారు. చిత్తూరులోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయని, అలాగే కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లాలో సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని ముఖ్యమంత్రికి వివరించారు. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో పంటలు నీటమునిగిన ఘటనలు ఉన్నాయని.. వర్షాలు తగ్గగానే పంట నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి.. అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాకుతో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని.. భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే.. సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలన్నారు. అలాగే కంట్రోల్ రూమ్‌లు, పునరావాసా కేంద్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: