అతి త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ అనేక వరాలతో తమ మేనిఫెస్టో ప్రకటించగా ఇప్పుడు బీజేపీ సైతం అనేకమైన వరాలను కలిపి తన మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలకు అభివృద్ధి ,ఆత్మగౌరవం రెండు ముఖ్యమన్నారు. ఈరెండింటి ఆధారంగా చేసుకొని మేనిఫెస్టో చేశామన్నారు. అభివృద్ధి, ఆత్మగౌరవంల కలయికే తమ మేనిఫెస్టో అని తెలిపారు. అలాగే మెట్రో రైలు ,సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్ అందరికీ అందిస్తామన్నారు. కరోనా టెస్టింగ్ సెంటర్లను పెంచుతామన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేసి ..15 వేల కోట్ల భారం హైదరాబాద్ ప్రజలపై పడకుండా విముక్తి కల్పిస్తామన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి 25 వేల రూపాయలు అకౌంట్లలో వేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి అవాస్ యోజన కింద అందరికి గృహ నిర్మాణాలు చేపడతామన్నారు. ఆన్ లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణ చేపడతామన్నారు. ఉచిత నల్లా కనెక్షన్ ఉచిత నీరు అందించి మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నారు.

10 వేల కోట్లతో సుమేధ కొత్త చట్టం తీసుకువస్తామన్నారు. సుమేధ ద్వారా నాలల నిర్మాణం అక్రమ కట్టడాలు కూల్చివేత చేపడతామని హామీ ఇచ్చారు. 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్.. అందిస్తామన్నారు. గ్రేటర్‌లో తాము గెలిస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అభివృద్ధి జరగాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నారు బండి సంజయ్. టీఆరెస్ మేనిఫెస్టో కూడా వెబ్ సైట్ నుంచి తొలగించారన్నారు. మార్పు కోసమే బీజేపీ మేనిఫెస్టో తయారు చేసిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: