అయితే ఈ నెల 28న అసలైన రాజకీయ సమరం జరగనుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 28న, శనివారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ భారీ ప్రచార బహిరంగ సభ నిర్వహిస్తారని ఈ నెల 19న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కాగా అదే రోజున ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారు కావడం రాజకీయ చర్చకు దారి తీస్తుంది. దీంతో గ్రేటర్ ఎన్నికల రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ప్రధాని మోదీ 28న మధ్యాహ్నం హైదరాబాద్ పర్యటనకు వస్తున్నా రని గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.
కోవిడ్–19 వైరస్కు విరుగుడుగా నగరానికి చెందిన భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్’ పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ప్రధాని ఈ పర్యటనకు శ్రీకారం చుట్టినప్పటికీ.. ఇందుకోసం ఆయన ఎంపిక చేసుకున్న సమయంపై పలురకాల చర్చకు దారి తీస్తుంది. 28న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా మోదీ హకీంపేట సైనిక విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి శామీర్పేట వద్ద గల భారత్ బయోటెక్ ల్యాబ్ను సందర్శిస్తారు. వ్యాక్సిన్ రూపకల్పనకు కృషిచేస్తున్న శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుంటారు. అదే రోజున ఈనెల 28న 30 వేలమందితో నగరంలో సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే కెసిఆర్ బహిరంగ సభ నిర్వహించే రోజున ప్రధాని మోదీ అధికారిక పర్యటన ఖరారు కావడం వెనక బీజేపీ వ్యూహం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి బిజెపి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు చివరి అస్త్రంగా ప్రధాని మోదీని నగరానికి రప్పిస్తున్నట్టు తెలుస్తుంది.