మన దేశంలో ఇకపై భారతీయ ప్రమాణాలు (బీఐఎస్) కలిగిన హెల్మెట్లనే తయారీ సంస్థలు తయారు చేయాలని, వాటినే వాహనదారులు కూడా వాడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ‘ హెల్మెట్ ఫర్ రైడర్స్ ఆఫ్ టూ వీలర్స్ మోటార్ వెహికిల్స్ ఆర్డర్, 2020’ అనే పేరుతో మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేయగా.. ఆ కమిటి సూచించిన సూచనలు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో ఎయిమ్స్ వైద్యలు సహా వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారు.


 

భారత శీతోష్ణస్థితికి అనుకూలంగా బరువు తక్కువ ఉన్న హెల్మెట్లను వాడాలని కమిటీ 2018 మార్చిలో సూచనలు చేసింది. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినా ప్రాణాపాయం ముప్పు తగ్గే అవకాశం ఉంటుందని ఉపరితల రవాణా శాఖ పేర్కొంది. ఏటా దేశంలో దాదాపు 1.7 కోట్ల ద్విచక్ర వాహనాలు తయారు అవుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జెనీవాకు చెందిన ‘ది ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్’ సంస్థ ప్రశంసించింది. ఇకపై భారత్లో బీఐఎస్ ఆమోదించని హెల్మెట్లను విక్రయిస్తే నేరంగా పరిగణిస్తారని సంస్థ అధ్యక్షుడు కేకే కపిలా తెలిపారు. వినియోగదారులు ఎక్కడ కొనుగోలు చేసినా కూడా ఆ హెల్మెట్‌పై బీఐఎస్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి. హెల్మెట్‌పై ఈ మార్క్ లేకపోతే పెనాల్టీ పడుతుంది. ఈ నిబంధన 2021 మార్చి 1 నుంచి అమలులోకి వస్తుంది. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా లేని హెల్మెట్లను తయారు చేసే వారికి అలాగే అలాంటి హెల్మెట్లు వినియోగించేవారికి కూడా జరిమానా పడుతుంది. అంతేకాకుండా జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: