ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులే వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కడప జిల్లా జమ్మలమడుగు నాగుల కట్టవీధిలో దంపతులు ఘర్షణ పడ్డారు. అయితే గొడవపై భార్య పోలీసులకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులకు సమీప బంధువు మార్క్. దంపతులు తరచూ గొడవ పడేవారని సముదాయించే ప్రయత్నం చేశారు. పోలీసుల్లో ఒకరు మార్క్తో దురుసుగా ప్రవర్తించి, దాడిచేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మనస్థాపానికి గురైన మార్క్ ఆత్మహత్యాయత్నం చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భార్య భర్తల మధ్య గొడవ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దారి తీసింది. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని నాగుల కట్ట వీధిలో ఉంటున్న దంపతులు ఘర్షణ పడ్డారు. గొడవపై భార్య 100 నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు సంఘటన స్థలానికి చేరుకుని దంపతులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సమీప బంధువైన మార్క్ పోలీసు వద్దకు వెళ్లి దంపతులు తరచూ గొడవ పడేవారని మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని సముదాయించే ప్రయత్నం చేశారు.

ఇక మార్క్పై పోలీసుల్లో ఒకరు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల చర్యకు మనస్థాపానికి గురైన మార్క్ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఆయనను కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తీసుకెళ్లారు. పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగానే మార్క్ ఆత్మహత్యాయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆగ్రహంతో జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు హామీ ఇవ్వడంతో మార్క్ కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: