అయితే ఏపీ లో మరి కొన్ని రోజుల్లో శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అధికార పార్టీ ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది.. ఈ సమావేశాలకు చంద్రబాబు వచ్చేది రానికేది కొంత అనుమానంగా ఉంది. 60 యేళ్ల వయసు పైనున్న వారు బయట తిరగడం మీద కూడా ప్రస్తుతం ఒకరకంగా ఆంక్షలు ఉన్నట్టే. ప్రభుత్వం కూడా ఆ వయసు పై బడిన వారు జనం మధ్యకు రావొద్దని సూచిస్తూ ఉంది.
ఇప్పటికే కరోనాకి వ్యాక్సిన్ వచ్చే వరకూ తాను ప్రజల్లోకి రాలేనని ఇప్పటికే చంద్రబాబు తేల్చేశారు. దాని కోసం ఆయన ఎదురుచూస్తూ ఎక్కువ సమయమంతా హైదరాబాద్ లోనే గడుపుతున్నారు. కేవలం జూమ్ సమావేశాలకే పరిమితమవుతున్నారు. చివరకు టీడీఎల్పీ మీటింగ్ కూడా ఆయన జూమ్ లోనే నిర్వహించారు. కానీ తీరా చూస్తే పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి ఢుమ్మా కొట్టడం చూస్తుంటే టీడీపీ నేతల్లో నైరాశ్యం తీవ్రమవుతున్నట్టు కనిపిస్తోంది. అధినేత మీద విశ్వాసం సన్నగిల్లుతుండడం, ఏపీలో పార్టీ కోలుకుంటుందనే నమ్మకం తగ్గుతుండడంతో చాలామంది ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోతున్నట్టు కనిపిస్తోంది. చివరకు ఎమ్మెల్యేల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో తిరుపతి ఉప ఎన్నికలకు కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలను పలువురు ద్వితీయ శ్రేణి నేతలకు అప్పగించడం టీడీపీ పరిస్థితిని చాటిచెబుతోంది. చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ సభలో వైఎస్సార్సీపీని ఎదుర్కోవడం ఇప్పుడు తలకుమించిన భారంగా మారుతోంది. దాంతో గతంలో ఎన్నడూ లేని ఇంతటి సంక్లిష్ట స్థితి నుంచి పార్టీని గట్టెక్కించడం బాబుకి కూడా తలకుమించిన భారం అవుతోంది.