గత నాలుగైదు రోజులుగా నివర్ తుఫాన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరొక షాకింగ్ వార్త. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. డిసెంబరు 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దాని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి. నేడు, రేపు తెలంగాణలో పొడి వాతావరణం ఉండనుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి.. డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు- పాండిచ్చేరి మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది.




డిసెంబర్‌ 1 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో భారీవర్షాలు కురువనున్నాయి. వాయుగుండం పశ్చిమదిశగా కదిలి 2న దక్షిణ తమిళనాడులోని కోస్తా ప్రాంతాన్ని తాకుతుందని చెప్పాయి. దీని ప్రభావంతో వచ్చే రోజుల్లో దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో తమిళనాడు, పుదుచ్చేరి కరైకల్‌, మహే, లక్షద్వీప్‌, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ తీరం, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించాయి. అటు, అల్పపీడన ప్రభావంతో డిసెంబరు 1 నుంచి తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంతంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. ఇప్పటికే నివర్ తుఫాన్ ప్రభావంతో భారీగా నష్టపోయిన రైతాంగాన్ని ఇప్పుడు మరో అల్పపీడనం తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోంది. పంట చేతికొచ్చిన సమయంలో వరుసగా ఇలాంటి తుఫాన్లు ముంచుకు రావడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. నివర్ తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగానికి కడగండ్లు మిగిల్చింది. దీనికి సంబంధించిన సహాయం ఇంకా ప్రభుత్వాల నుండి రైతన్నలకు అందాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: