భారతీయ కిసాన్ యూనియన్ క్రాంతికారి పంజాబ్ యూనిట్ అధ్యక్షుడు సుర్జీత్ సింగ్ మాట్లాడుతూ, తాము బురారీ పార్క్కు వెళ్లమని తేల్చేశారు. అది పార్క్ కాదని, ఒక బహిరంగ జైలుగా తమకు తెలిసిందని వివరించారు.రైతు సంఘాలు ప్రధానంగా నాలుగు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాయి. మూడు నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, పంటకు కనీస మద్దతు ధర గ్యారంటీ ఇవ్వాలని, పంటనష్టాలను కాల్చివేస్తే విధించే జరిమానాలు తొలగించాలని, ఎలక్ట్రిసిటీ ఆర్డినెన్స్ నిలిపేయాలని డిమాండ్ చేశాయి. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020తో కరెంట్ బిల్లులపై రైతులు పొందే సబ్సిడీ రద్దు కానుంది.
ఇదిలా ఉండగా రైతుల నిరసన నేపథ్యంలో బీజేపీ నేతలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నరేంద్రసింగ్ తోమర్ తదితరులు హాజరయ్యారు.. ఓవైపు రైతుల ఆందోళనలు ఉధృతం అవుతున్న సమయంలో.. ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రైతులకు చర్చలకు సిద్ధమని.. ప్రభుత్వం ప్రకటించినా.. వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవడమే ప్రధాన డిమాండ్ అని రైతు సంఘాల నేతలు తెగేసి చెప్పడంతో.. ప్రభుత్వానికి ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. రైతుల ఆందోళనకు ఎలా పులిస్టాప్ పెట్టాలి.. వారికి ఎలా నచ్చజెప్పాలి, ఆందోళన ఎలా విరమింపజేయాలి అనే దానిపై బీజేపీ అగ్రనాయత్వం దృష్టిసారించినట్లుగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.