కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలోని కొండపల్లికి గ్రామానికి చెందిన గిరిజన బాలిక పసుల నిర్మల(15) ఆదివారం పెద్దపులి దాడిలో మృతిచెందింది.  నిర్మల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే బంధువు సత్తయ్య చేనులోకి ఆరుగురు కూలీలతో కలిసి పత్తి తీసేందుకు వెళ్లింది. మధ్యాహ్నం నిర్మల మిగతా వారికి దూరంగా పత్తి తీస్తుండగా ఒక్కసారిగా పులి దాడి చేసి ఆమెను ఈడ్చుకెళ్లింది. ఆమె అరుపులతో మిగతా కూలీలు భయపడ్డారు. తోటి కూలీల్లో ఒకడైన చక్రవర్తి కర్రలు తీసుకుని పులి వెంట పరుగెత్తాడు. దీంతో పులి నిర్మలను వదిలేసి కొంతదూరం వెళ్లింది. తోటి కూలీలు ధైర్యం చేసి నిర్మల వద్దకు వెళ్లి చూసేసరికి అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. వారు మృతదేహాన్ని తీసుకువస్తుండగా పులి మళ్లీ వారి వెంట పడింది. అప్పటికే వీరి కేకలు విని చుట్టుపక్కల చేలలో పని చేస్తున్న వారు అక్కడి వచ్చారు. పులి మళ్లీ రావడం చూసిన వారు అరుస్తూ దానిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. గ్రామస్థులకు సమాచారం తెలియడంతో అందరూ సంఘటనా స్థలానికి వచ్చారు.

జిల్లా అటవీ అధికారి శాంతారామ్‌, ఏఎస్పీ సుదీంద్ర, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు సంఘటనా స్థలానికి వెళ్లి పులి దాడి ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.25లక్షల నష్టపరిహారం అందించాలని బంధువులు, స్థానికులు డిమాండ్‌ చేశారు. అటవీశాఖలో ఉద్యోగంతో పాటు రూ.5లక్షలు అందిస్తామని అటవీ అధికారులు పేర్కొన్నారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత కుటుంబానికి మరో రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్‌ అనే యువకుడిని పులి చంపిన విషయం మరువక ముందే ఆదివారం మరో బాలిక మృతి చెందింది. దీంతో అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు.

ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించా

-చక్రవర్తి, ప్రత్యక్ష సాక్షి

ఉదయం పూట పత్తి ఏరేందుకు కూలీలం వెళ్లాం. మధ్యాహ్నం ఒక్కసారిగా నిర్మలపై పులి దాడి చేసి అటవిలోకి పట్టుకెళ్లేందుకు ప్రయత్నించింది. వెంటనే నేను కర్రలతో, బండరాళ్లతో పులిని కొడుతూ కేకలు వేస్తూ నిర్మలను కాపాడేందుకు శతావిధాలా ప్రయత్నం చేశా. తోటి కూలీలు కూడా అరుపులు, కేకలు వేస్తూ వచ్చారు. దీంత పులి నిర్మలను వదిలి కొంతదూరం వెళ్లింది. నిర్మల వద్దకు వెళ్లి చూసే సరికే మృతి చెంది ఉంది. ఆమె మృతదేహాన్ని తీసుకొస్తుండగా పులి మళ్లీ దాడి చేసేందుకు ప్రయత్నించింది. అందరం బిగ్గరగా అరవడంతో అడవిలోకి వెళ్లిపోయింది.

పులి ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు

-జిల్లా అటవీ అధికారి శాంతారాం

పులి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. టైగర్‌ వైల్డ్‌ లైఫ్‌ బృందాలతో రెండు బోన్లను ఏర్పాటు చేశాం. గిరిజనుల వలసను ఆపేందుకు రోజుకు 20 మంది కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక నర్సరీ ఏర్పాటు చేస్తాం. దహెగాం, పెంచికలపేటలో పులి దాడి ఘటనలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: