ఇప్పటికే రైతు ఆందోళనలతో దేశ రాజధాని దద్దరిల్లుతోంది. ప్రభుత్వం తీరులో మార్పు రాకపోతే మునుముందు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు కేంద్రానికి హెచ్చిరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏం నిర్ణయం తీసుకోవాలనే సమాలోచనలో మోడీ సర్కారు పడినట్టు తెలసుస్తోది. దీనికి అనుగుణంగానే ఆదివారం రాత్రి.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు మంత్రులు కలిసి సమావేశమై చర్చలు జరిపారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లతో పాటు పలువురు కీలక నేతలు పాలుపంచుకున్నట్టు సమాచారం. దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో రైతు ఆందోళనల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ప్రధానంగా రైతులు చేస్తున్న ఆందోళనలు, వారి హెచ్చిరికలు, ఇందులో ప్రతిపక్షాల పాత్రపైనా చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కాగా, రహదారులుపై నిరసనలను విరమించి బురాడీ గ్రౌండ్కు చేరాలనే షరతుతో.. డిసెంబర్ 3న జర్చలకు రావాలని అమిత్ షా.. రైతులను కోరిన సంగతి తెలిసిందే. అయితే, షరతులతో కూడిన చర్చలు జరపడానికి తాము సిద్ధంగా లేమని కేంద్ర ప్రభుత్వానికి రైతులు తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ తాము ఆందోళనలు కొనసాగిస్తామనీ, ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరిస్తే.. దేశవ్యాప్తంగా తమ ఆందోళనను ఉధృతం చేయడంతో పాటు ఢిల్లీ చుట్టూ ఉన్న సోనీపట్, రోహతక్, జైపూర్, ఘజియాబాద్- హాఫుర్, మథుర మార్గాలను మూసివేసే విధంగా తమ నిరసనలు కొనసాగుతాయని హెచ్చిరించారు రైతులు. ఎలా చూసిన రైతులు వెనక్కి తగ్గేలా లేరు.. ఈ టైంలో మోడీ సర్కారు ఏం నిర్ణయం తీసుకోనుందో చూడాలి మరి....!