అయితే, తమిళనాట ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో సూపర్ స్టార్ రజినీ కాంత్.. తన అభిమాన సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న "రజినీ మక్కల్ మండ్రం" నిర్వాహకులతో సోమవారం ఉదయం భేటీ కావడంతో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ సమావేశంలో వాడివేడి చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా రజినీ రాజకీయ రంగ ప్రవేశంతో పాటు అనంతరం జరిగే ఎన్నికల వ్యూహంపైనా చర్చించినట్టు సమాచారం.
ఈ భేటీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాల నాయకులతో పాటు రజినీ మక్కల్ మండ్రం కీలక సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రజినీ పార్టీ పెట్టాలనీ, తాము అండగా నిలబడతామని ఆయన అభిమానులు కుండబద్దలు కొట్టి.. సూటిగా చెప్పినట్టు అభిమానులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో సొంతంగానే బరిలోకి దిగాలని సూచించడంతో పాటు ఏ పార్టీకి మద్ధతు ప్రకటించిన తాము దానిని అంగీకరించడాకిని సిద్ధంగా లేమని కరాఖండిగా చెప్పారట. అలాగే, రజినీ బీజేపీ తీర్థం పుచ్చుకోన్నట్టు వస్తున్న వార్తాల నేపథ్యంలో ఈ సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు సమాచారం.
కాగా, రజినీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశం పూర్తి అయిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది. అతి త్వరలోనే సూపర్ స్టార్ రజినీ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటిని మీడియాకు వెల్లడించే అవకాశంలేకపోలేదు. అయితే, ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి పూర్తి వివరాలను రజినీ పుట్టిన రోజైన డిసెంబర్ 12 వెల్లడించే అవకాశాలు అధికంగా వున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఏదైతేనేమి చాలా కాలంగా రజినీ రాజకీయ ప్రవేశం ఓ కొలిక్కిరానున్నదని ఈ సమావేశాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఈ రోజు జరుగుతున్న సమావేశం నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద కు భారీగా చేరిన అభిమానులు తెగ సందడి చేస్తున్నారు.